Transformers | సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ పరిధిలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నది. అందుకు తాజా నిదర్శనం.. జీహెచ్ఎంసీ పరిధిలో గతేడాది మార్చి 6వ తేదీ నాటికి 59.53 మిలియన్ యూనిట్లుగా ఉన్న అత్యధిక విద్యుత్ వినియోగం, 2024లో 6న అత్యధికంగా 69.31 మిలియన్ యూనిట్లు, 7న 70.71 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. ఇలా విద్యుత్ వినియోగం పెరగడం ఈ సీజన్లో ఇదే అధికమని అధికారులు ప్రకటించారు.
విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా దానికి తగ్గట్టుగా సరఫరా అందించేందుకు విద్యుత్ సంస్థలు సంసిద్ధమై ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రస్తుత పరిమాణాలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఓవర్ లోడ్తో ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో పట్టణీకరణ వేగంగా చోటుచేసుకుంటున్న ప్రాంతాల్లోని ఒక్కో ట్రాన్స్ఫార్మర్పై 30 శాతానికి పైగా అదనపు లోడు పడుతున్నది. అక్కడ వెంటనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యాన్ని పెంచడం గానీ, దానిపై ఒత్తిడి తగ్గించేలా అదనంగా మరో ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి కనెక్షన్లను తగ్గించడంగానీ చేయాలి.
సైబర్ సిటీ సర్కిల్ పరిధిలోని గౌలిదొడ్డి ప్రాంతంలో 160 కేవీఎ డీటీఆర్ ఓవర్లోడ్తో సమస్య ఎదురైందని, లోడ్ బ్యాలెన్సింగ్ కోసం కొత్తగా డిస్ట్రిబ్యూషన్ బాక్స్ ఏర్పాటు చేసినట్లు ట్విట్టర్ వేదికగా ఎస్ఈ ఆపరేషన్స్ సైబర్సిటీ పేరుతో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేశారు. ఇది ఒక సర్కిల్లో ఒక రోజు వచ్చిన ఫిర్యాదు. ఇలా గ్రేటర్ పరిధిలో మొత్తం 9 సర్కిళ్లు ఉన్నాయి. వాటి పరిధిలో తరచూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ విద్యుత్ వినియోగం నగర శివారు సర్కిళ్లు అయిన రాజేంద్రనగర్, సైబర్ సిటీ సర్కిల్, హబ్సిగూడ, సరూర్నగర్, మేడ్చల్లలో ఉన్నది. ఆ తర్వాత కోర్ సిటీ ప్రాంతమైన హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ సర్కిళ్లు ఉండగా, రాజేంద్రనగర్, సైబర్ సిటీ సర్కిల్, హబ్సిగూడ, సరూర్నగర్, మేడ్చల్లో విద్యుత్ వినియోగం గతేడాదితో పోల్చితే చాలా పెరిగింది.
ప్రతి యేటా విద్యుత్ సంస్థ సమ్మర్ యాక్షన్ ప్లాన్ను జనవరి నెలలోనే చేపడుతాయి. ఈసారి జనవరి రెండో వారం నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు వేసవి కార్యాచరణ చేపట్టినా.. ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు మాత్రం ఇప్పటికీ జరగలేదు. కేవలం అదనపు ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్లు, కొత్త లైన్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఒక నివేదికను రూపొందించారు. ఈ రోజుకు ఉన్న ట్రాన్స్ఫార్మర్ల మీద పడుతున్న ఓవర్లోడ్తో వస్తున్న సమస్యలను పరిష్కరిస్తున్నారే తప్ప, అక్కడ అదనంగా అధిక సామర్థ్యంతో కూడిన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడంలేదు. ఇలా ఒక చోట ట్రాన్స్ఫార్మర్ వద్ద చేసిన మరమ్మతులు మళ్లీ రెండుమూడు రోజులకే పునరావృతం అవుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు.
ఈసారి ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం, వ్యవసాయంతోపాటు అన్ని కేటగిరీల వినియోదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండటంతో వినియోగం సైతం భారీగా పెరుగుతున్నది. అదే సమయంలో ఓవర్ లోడ్తో విద్యుత్ అంతరాయాలు సైతం అధికంగా ఉన్నాయని వినియోగదారులు పేర్కొన్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఓవర్లోడ్ ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ వెంటనే కొత్తగా అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలనే వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.
క్షేత్ర స్థాయిలో విద్యుత్ సరఫరా పరంగా అవసరమైన పనులు చేపట్టేందుకు లైన్ క్లియరెన్స్(ఎల్సీ) ఇవ్వాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఎల్సీలు ఇస్తే ఎక్కడ కరెంటు కోతలు విధిస్తున్నారన్న ప్రచారం తలెత్తుతుందన్న భయంతో గత రెండు నెలలుగా ఎల్సీలు ఇవ్వడం లేదని, పనులు పూర్తి చేసిన విద్యుత్ కాంట్రాక్టర్లు ఏకంగా సీఎండీని కలిసి విజ్ఞప్తి చేశారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎస్పీడీసీఎల్) పరిధిలోనే రెండు నెలల్లో సుమారు రూ.20 కోట్లతో చేపట్టిన పనులు ఉండగా, వాటికి ఎల్సీ ఇస్తేనే కొత్త వారికి విద్యుత్ సరఫరా అందుతుందని, దాని వల్ల విద్యుత్ శాఖకు ఆదాయంతోపాటు పరిశ్రమలు, ఇతర కార్యకలాపాలు సాఫీగా సాగుతాయి. అయినా అవేవీ పట్టించుకోకుండా ఎల్సీలను ఇవ్వకుండా తరచూ తలెత్తుతున్న ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కోసమే ఎల్సీలు తీసుకొని కాలం గడిపేస్తున్నారే తప్ప, సరైన పరిష్కారం చూపడం లేదన్న ఆరోపణలు విద్యుత్ నిపుణులు చేస్తున్నారు.