Hyderabad | సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): నగర శివారు ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడంపై హెచ్ఎండీఏ ప్రత్యేక దృష్టి సారించింది. కోర్ సిటీకి దీటుగా ఔటర్ రింగు రోడ్డు ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లో హెచ్ఎండీఏ మాస్టర్ప్లాన్కు అనుగుణంగా 60,80,100 అడుగుల రోడ్ల నిర్మాణంపై ప్రత్యేకంగా సర్వే చేపట్టింది. వేగంగా విస్తరిస్తున్న శివారు ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న రోడ్ల స్థానంలో హెచ్ఎండీఏ మాస్టర్ప్లాన్లో నిర్ణయించిన రోడ్ల వెడల్పుకు అనుగుణంగా రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. తాజాగా ఐటీ కారిడార్లోని కోకాపేట నుంచి శంకర్పల్లి, కొల్లూరు ప్రాంతాల్లో నివాస ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ చేయాలనే ఆలోచనకు హెచ్ఎండీఏ శ్రీకారం చుట్టింది.
5.39 కోట్లతో రోడ్ల విస్తరణ…
ఐటీ కారిడార్లోని కోకాపేట నుంచి శంకర్పల్లి వరకు, ఓఆర్ఆర్ వెంట ఉన్న కొల్లూరు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో నిర్మాణ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. ప్రస్తుతం మెహిదీపట్నం నుంచి నార్సింగి, కోకాపేట మీదుగా శంకర్పల్లి ప్రధాన రహదారి 120 అడుగుల విస్తీర్ణంతో ఉంది. దీనికి అనుసంధానంగా మోకిల నుంచి కొల్లూరు, జన్వాడ, మీర్జాగూడ ప్రాంతాల్లో రోడ్లు అప్పటి పంచాయతీ రాజ్ సంస్థలు వేసినవే ఉన్నాయి. ఇవి ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో ఉండటంతో రోడ్ల విస్తరణ పనులను చేపట్టాలని నిర్ణయించారు. సుమారు రూ.5.39 కోట్ల వ్యయంతో రోడ్ల పనులను చేపడతున్నారు. దీనికి సంబంధించిన పనులను చేపట్టేందుకు టెండర్లు సైతం హెచ్ఎండీఏ అధికారులు పిలిచారు. ఈనెల 21 వరకు టెండర్లు సమర్పించేందుకు గడువు విధించారు.
ప్రణాళికాబద్ధంగా పట్టణీకరణ…
నూతనంగా నివాస ప్రాంతాలు జీహెచ్ఎంసీ పరిధిలోనే కాకుండా హెచ్ఎండీఏ పరిధిలో ఓఆర్ఆర్కు ఇరువైపులా ఉన్న శివారు ప్రాంతాల్లో భారీ ఎత్తున వస్తున్నాయి. ప్రణాళికా బద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా హెచ్ఎండీఏ పనిచేస్తోంది. గ్రేటర్ చుట్టూ ఉన్న హెచ్ఎండీఏ పరిధిలో 37 వరకు మున్సిపాలిటీలు ఉండగా, అందులో పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. దానికి అనుగుణంగానే ఆయా ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది.