సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ స్థాయి సంఘం సభ్యుల ఎన్నికకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఏడాది కాల పరిమితిలో ఉన్న ప్రస్తుత 15 మంది సభ్యుల పదవీ కాలం గత నెల మూడవ వారం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ ఉన్నందున కొత్తగా స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల జాప్యం జరిగింది. ప్రస్తుతం కోడ్ ముగియడంతో స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో మొత్తం 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులకుగానూ బీఆర్ఎస్ నుంచి 8 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు కొనసాగారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మారిన నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
కాగా ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి ఆర్ .సునీత, రాగం నాగేందర్ యాదవ్, టి. మహేశ్వరీ, బండారి రాజ్కుమార్ పటేల్, వనం సంగీతా యాదవ్, శాంతిజెన్ శేఖర్, సతీశ్ బాబు పండాల, ఈఎస్ రాజ్ జితేంద్రనాథ్ , ఎంఐఎం నుంచి అబ్దుల్ వాహేద్, మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, సయ్యద్ సోహేల్ ఖాద్రీ, మహమూద్ అబ్దుల్ ముక్తధార్, సయ్యద్ మినిహాజుద్దీన్, సమీరా బేగం, మహమూద్ మాజీద్ హుస్సేన్లు కొనసాగారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు జీహెచ్ఎంసీలో రూ. రెండు కోట్ల నుంచి రూ. 3 కోట్ల మేర విలువైన పనులకు స్టాండింగ్ కమిటీ వారానికోసారి సమావేశం అవుతుంది. ఇందుకు వారంలో ఏదో ఒక రోజును ఎంపిక చేసుకోవడం ఆనవాయితీ. గత పాలక మండలిలో ప్రతి గురువారం నిర్వహించేవారు.