జూబ్లీహిల్స్,జనవరి1: పదో తరగతి విద్యార్థులకు ప్రతి ఆదివారం పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పది విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ రివిజన్ టెస్ట్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 1 గంట, సాయంత్రం ఒక గంట అదనపు క్లాసులు నిర్వహిస్తూ డిసెంబర్ 31 తో సిలబస్ పూర్తిచేసి జనవరి 8 నుంచి స్పెషల్ రివిజన్ టెస్ట్లు నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలుచేయనున్నారు.
ఇందుకు గానూ జనవరి 3 నుంచి మార్చి 10 వరకు 40 రోజుల స్పెషల్ రివిజన్ క్లాసులతో పాటు ఫిబ్రవరిలో ప్రీ ఫైనల్-1, మార్చిలో ప్రీ ఫైనల్-2 పరీక్షలు సైతం నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. పదో తరగతి విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
భయం పోగొట్టేందుకే…
పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై భయం పోగొట్టేందుకు ప్రతి ఆదివారం ఆయా సబెక్టుల వారీగా పరీక్షలు నిర్వహిస్తాం. ఇందుకోసం అన్ని పాఠశాలల్లో డిసెంబర్ 31 వరకు సిలబస్ పూర్తిచేశాం. ఆయా పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చిన వారిని గుర్తించి వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నాం. పరీక్షలకు పూర్తిస్థాయిలో సంసిద్ధులను చేస్తాం.
– డిప్యూటీ డీఈవో శామ్యూల్రాజ్