సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికలు సజావుగా ముగిసాయి. ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు ఎన్నికల కత్రువు ముగించారు. అయితే ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేల్చిన ఈవీఎంలను మాత్రం పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూంలకు తరలించారు. ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు, పోస్టల్ బ్యాలెట్ పేపర్లు, వీవీ ప్యాట్లలోని స్లిప్పులు, మాక్పోల్ ధ్రువపత్రాలు, పీఓ డైరీ, టెండర్ బ్యాలెట్ పేపర్, తదితర ఎన్నికల సామగ్రిని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆయా రిటర్నింగ్ అధికారులు స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచి తాళాలు వేసి సీల్ వేశారు.
ఈవీఎంల భద్రతకు ఎన్నికల సంఘం అధికారులు స్ట్రాంగ్ రూమ్లలో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత 45 రోజుల పాటు జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఈవీఎంలకు భద్రత కల్పిస్తారు. అనంతరం వాటిని ఎన్నికల సంఘానికి అప్పగించి గోదాంలకు చేర్చుతారు. ఆ తరువాత ఎన్నికల సంఘం నియమించిన ఇంజినీర్లు వచ్చి వాటిలోని డేటాను తొలగించి అవసరాన్ని బట్టి దేశంలో ఎక్కడైనా ఎన్నికలు జరిగితే అక్కడికి తీసుకెళ్లి ఉపయోగిస్తారు.
ఐదేండ్ల సమయంలో అవి కీలకం..
అభ్యర్థుల మధ్య ఎన్నిక పోటాపోటీగా జరిగినప్పుడు గోదాంలలో భద్రపరిచిన ఈవీఎంల కంట్రోల్ యూనిట్లు కీలకమవుతాయి. అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిన అభ్యర్థులు ఎప్పుడైనా ఓట్లను మళ్లీ లెక్కించాలని న్యాయస్థానాలకు వెళ్లవచ్చు. అంతేకాదు ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత గెలిచిన అభ్యర్థిపై ఓడిపోయిన వారు ఎప్పుడైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు సమయంలో ఏవైనా అవకతవకలు జరిగాయని సదరు అభ్యర్థులు భావించి న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో అభ్యర్థులకు న్యాయం చేయడానికి ఈవీఎంల కంట్రోల్ యూనిట్లలో నిక్షిప్తమైన ఓట్లను మళ్లీ లెక్కించాలని న్యాయస్థానం ఆదేశించవచ్చు. అలాంటి సందర్భాల్లో ఇవి కీలకమవుతాయి. ఏ నియోజకవర్గంలో ఫిర్యాదు అందితే దానికి సంబంధించిన కంట్రోల్ యూనిట్లలో ఓట్లను తక్షణమే లెక్కించడానికి వీలుగా అధికారులు ఈవీఎంలను భద్రపరిచారు.