రవీంద్రభారతి, ఫిబ్రవరి 21 : తెలుగు భాష పరిరక్షణ కోసం సాహితీవేత్తలు, కవులు, కళాకారులు కృషిచేయాల్సిన అవసరం మనందరిపై ఉందని అధికార భాషా సంఘం చైర్పర్సన్ మంత్రి శ్రీదేవి, బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో మంగళవారం మాతృ భాష నాడు-నేడు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మాతృభాషం కోసం గిడుగు రామూర్తి, కాళోజీ, డాక్టర్ సినారె, సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి వంటి మహనీయులు ఎంతగానో కృషిచేశారని కొనియాడారు.
అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో తెలంగాణ భాషకు గొప్ప గౌరవాన్ని తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. భాషా ప్రియులు, భాషాభిమానులు, సాహిత్యపరులు భాషను పరిరక్షించుకోవాలని కోరారు. భాష కోసం అనేక దేశాలలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయని.. మన పొరుగుదేశం బంగ్లాదేశ్లో భాష పరిరక్షణ కోసం పోరాటం చేసి మాతృదేశాన్ని ఏర్పాటు చేసుకున్నారని గుర్తు చేశారు.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు భాషా చైతన్య సమితి, అక్షర కౌముది సేవా సంస్థ, నక్క వెంకటమ్మయాదవ్, నక్కయాదగిరి యాదవ్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్, పాలడుగు నాగయ్య కళాపీఠం, లక్ష్య సాధన ఫౌండేషన్, గోల్కొండ సాహితీ కళాసమితి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 13 మంది కవులకు పురస్కారాలు ప్రదానం చేశారు. తెలుగు భాషా చైతన్య సమితి అధ్యక్షుడు పి.బడేసాబ్, ప్రముఖ సాహతీ వేత్త రామకృష్ణ చంద్రమౌళి, కవి రఘురాములుగౌడ్, బి.జయరాములు, పాలడుగు సరోజినిదేవి, తులసి వెంకటరమణాచార్యులు, మల్లెపూల వెంకటరమణ, ప్రజ్ఞారాజు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కవి సమ్మేళనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.