భోజన విరామం తర్వాత ప్రతి వార్డును క్లీన్ చేయాల్సిందే
ఐసీయూలో మందులు తప్ప ఇతర వస్తువులకు అనుమతి లేదు
క్యాంటీన్లో వ్యర్థపదార్థాలు నిల్వ ఉండకుండా చూడాలి
అన్ని వెంటిలేటర్లకు జాలీలు
పాత డ్రైనేజీ పైపులైన్లు, మ్యాన్హోల్స్కు మరమ్మతులు
వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ రమేశ్రెడ్డి
సిటీబ్యూరో, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలోని దవాఖానల్లో పరిశుభ్రతపై వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టి సారించారు. నగరంలోని ప్రధాన దవాఖానలు, టీచింగ్ హాస్పిటల్స్లో నెలకొన్న పారిశుధ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రధానంగా నిత్యం రోగులతో రద్దీగా ఉండే ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్జే, పేట్ల బుర్జ్ ప్రసూతి దవాఖాన, తదితర హాస్పిటళ్లలో పారిశుధ్య నిర్వహణపై కొంత కాలంగా వైద్యాధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా అన్ని ప్రధాన దవాఖానల్లో పారిశుధ్య నిర్వహణను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఆర్ఎంఓ స్థాయి అధికారిని నియమించారు. అంతే కాకుండా, వార్డులు, బ్లాకుల వారీగా కూడా పారిశుధ్యం, సెక్యూరిటీ తదితర అంశాల పర్యవేక్షణ బాధ్యతలను ఆయా అధికారులకు అప్పగించారు. ప్రధానంగా దవాఖానల్లో పారిశుధ్యంతో పాటు పిల్లలకు, ఎలుకలు, కుక్కలు, కోతులు వంటివి రాకుండా, దోమల బెడద లేకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
భోజన విరామం అనంతరం క్లీనింగ్ తప్పనిసరి..
భోజన విరామం తరువాత ప్రతి వార్డులో ఎలాంటి వ్యర్థ పదార్థాలు, తిను బండారాలు లేకుండా శుభ్రపర్చాలని, అందుకు ప్రత్యేకంగా గంట సమయం కేటాయిస్తూ అన్ని దవాఖానల సూపరింటెండ్లకు వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేష్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో వార్డుల్లో ఎలాంటి వ్యర్థా లు, తినుబండారాలు లేకుండా చాడాలని ఆదేశించారు.
రోగి సహాయకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
రోగి సహాయకులు బస చేయడానికి ఇప్పటికే ప్రత్యేక షెల్టర్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, చాలా మంది సహాయకులు వార్డుల్లోని తమ పేషెంట్ల వద్దనే భోజనాలు, టిఫిన్లు చేస్తుంటారు. ఇక నుంచి వార్డుల్లో కేవలం రోగులు మాత్రమే భోజనం, అల్ఫాహారం తినేందుకు అనుమతిస్తామని, రోగి సహాయకులు భోజనం చేయడానికి ప్రత్యేక ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తామని డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు. రోగి సహాయకులు భోజనం చేసే ప్రదేశంలో హ్యాండ్ వాష్, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపారు.
ఐసీయూలో మందులకు మాత్రమే అనుమతి
ఐసీయూలో రోగుల వద్ద కేవలం మందులు, ప్రిస్కిప్షన్స్, కే షీట్ వంటివి తప్ప ఇతర అనవసర వస్తువులు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంఈ తెలిపారు. ఐసీయూలో మందులు తప్ప ఇతర ఎలాంటి తినుబండారాలను అనుమతించబోమని స్పష్టం చేశారు.
ప్రతి రోజు అధికారులు తనిఖీలు చేయాల్సిందే…
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని టీచింగ్ హాస్పిటల్స్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ప్రధానంగా రోగుల రద్దీ అధికంగా ఉండే ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ తదితర హాస్పిటల్స్లో శానిటేషన్ పర్యవేక్షణ కోసం ఆర్ఎంఓలను నియమించాం. ప్రతిరోజు ఆయా దవాఖానలో సంబంధిత ఆర్ఎంఓ, హెడ్ నర్సులు వారికి కేటాయించిన ప్రాంతాల్లో తిరిగి, పారిశుధ్య పనులను పర్యవేక్షించేలా ఆదేశించాం. అంతే కాకుండా వారానికోసారి దవాఖాన సూపరింటెండెంట్, నర్సింగ్ మేట్రిన్లు దవాఖాన మొత్తం రౌండ్స్ వేసి శానిటేషన్, సెక్యూరిటీ తదితర అంశాలను పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నాం. దవాఖానల్లో అపరిశుభ్రత ఏర్పడటానికి, పిల్లులు, కుక్కలు, వంటి జంతువులు, ఎలుకలు, దోమలు రావడానికి ప్రధాన కారణం. ఎక్కడపడితే అక్కడ ఆహార పదార్ధాలు, వ్యర్థ పదార్ధాలను వేయటాన్ని గుర్తించాం. కొన్ని చోట్ల పురాతన డ్రైనేజీ వ్యవస్థ ఉండటం, ఓపెన్ మ్యాన్హోల్స్ ఉండటం వల్ల ఎలుకలు, పంది కొక్కులు వంటివి వస్తుండటాన్ని గమనించాం. వీటి నివారణకు ఇప్పటికే ప్రత్యేక చర్యలు చేపట్టాం. అందుకే వార్డుల్లో ఎక్కడ కూడా తినుబండారాలు లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసే విధంగా శానిటేషన్ సిబ్బందిని ఆదేశించాం. దోమల బెడద లేకుండా ఉండేందుకు వార్డుల్లో ఉన్న అన్ని వెంటిలేటర్లు, కిటికీలకు జాలీలు కొట్టిస్తున్నాం. డ్రైనేజీ పైప్లైన్లకు మరమ్మతులు చేయిస్తున్నాం.
రోగులు, రోగి సహాయకులు సహకరించాలి
దవాఖానలో పరిశుభ్రతకు రోగులు, రోగి సహాయకులు కూడా సహకరించాలి. ప్రధానంగా వార్డుల్లో, దవాఖాన పరిసరాల్లో ఎక్కడపడితే అక్కడ తినుబండారాలు, వ్యర్థ పదార్థాలను పడేయకూడదు. అలా చేయడం వల్ల పిల్లులు, కుక్కలు, ఎలుకలు వంటివి ప్రవేశిస్తాయి. దవాఖానల్లో ఏర్పాటు చేసిన డస్ట్బిన్లలోనే వ్యర్థ పదార్థాలు పడేయాలి.
– డాక్టర్ రమేశ్రెడ్డి, డీఎంఈ