గ్రేటర్ కాంగ్రెస్కు అనేక నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులే కనిపించకపోగా.. ఉన్న కొద్దిపాటి స్థానాల్లోనూ ప్యారాచూట్ నేతలు హస్తం పార్టీ కొంప ముంచుతున్నారు. ఇందులో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్లోకి ప్యారాచూట్ నేత మైనంపల్లి హన్మంతరావు కాలుమోపింది మొదలు… పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఏకంగా మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేయగా.. మరికొన్ని గంటల్లో మూకుమ్మడి రాజీనామాలకు కీలక నేతలు సిద్ధమవుతున్నారు. అయితే ప్యారాచూట్ నేతలు రావడం వెనక ప్రధానంగా ‘సీటుకు నోటు’ వ్యవహారం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ)
మల్కాజిగిరి, అక్టోబర్ 2 : “కష్టకాలంలోనూ నాతో కలిసి ముందుకు నడిచిన మల్కాజిగిరి నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని” మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 30 ఏండ్ల తన రాజకీయ జీవితంలో నేను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని, చనిపోతే కాంగ్రెస్ జెండా కప్పుకొని చనిపోవాలన్న అకాంక్షతో బతికిన వ్యక్తినని ఈ రోజు బాధతో చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. 2013లో కౌన్సిలర్గా, 2018లో కోఆప్షన్ సభ్యుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకున్నా పార్టీ ఆదేశాలని తూచా తప్పకుండా పనిచేసి ఆరోజు విజయానికి కృషి చేశానని తెలిపారు.
కుటుంబానికి ఒక్కటే టికెట్ ఇస్తామని ఉదయపూర్ డిక్లరేషన్లో ఎంపీ రాహుల్గాంధీ చెప్పారు. నియోజకవర్గంలో ఎన్నో అరాచకాలు చేసి, మాపై ఎన్నో కేసులు పెట్టిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం సరికాదన్నారు. ఇప్పటి వరకు బీసీలను కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుందనే నమ్మకంతో ఉండేవాడినని, ఈ రోజు నాకు టికెట్ ఇవ్వకుండా మాపై కేసులు పెట్టిన వారికి ఇవ్వడం బాధగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇన్ని రోజులు పార్టీకి సేవ చేసిన.. ఒక కన్న తల్లిగా కాంగ్రెస్ పార్టీని ప్రేమించిన.. కానీ కన్న తల్లే కాదనుకుంటే ఎవరికి చెప్పాలి..? ఎక్కడికి వెళ్లాలి..? ఇది ముందటి కాంగ్రెస్ పార్టీల కనిపిస్తలేదని అన్నారు. ఎన్నో ఇబ్బందులు పెట్టిన వ్యక్తిని తీసుకువచ్చి మెదక్, మల్కాజిగిరి టికెట్లు ఇస్తే.. పార్టీ మనుగడ ఏమవుతుందని ప్రశ్నించారు.