బంజారాహిల్స్, జూన్ 2: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలోని పౌరులకు భద్రత కల్పించడంతో పాటు వారికి సరైన సేవలందించేందుకు కొత్తగా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. జూబ్లీహిల్స్ సబ్ డివిజన్ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో శుక్రవారం కేసుల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఫిలింనగర్ పీఎస్ పరిధిలో నమోదైన మొట్టమొదటి ఎఫ్ఐఆర్ను కమిషనర్ సీవీ ఆనంద్ ఫిర్యాదుదారుడికి అందజేశారు. అనంతరం పోలీస్స్టేషన్లో అధికారులకు పలు సూచనలు చేశారు. పీఎస్లో కల్పించిన సదుపాయాల గూర్చి ఆరా తీశారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంతోపాటు మూడు కమిషనరేట్ల పరిధిలో ఇప్పటికే సుమారు కోటిన్నరకు పైగా జనాభా ఉన్నదని, వీరికి అదనంగా రోజూ సుమారు 40 లక్షల మంది వచ్చి పోతుంటారని తెలిపారు. ఇంత భారీ స్థాయిలో ఉన్న జనాభా అవసరాలకు అనుగుణంగా సేవలందించేందుకు మెగాసిటీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలనే సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు కొత్తగా 11 శాంతి భద్రతల పోలీస్స్టేషన్లు, 13 ట్రాఫిక్ పోలీస్స్టేషన్లు, 7 మహిళా పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఫిర్యాదుదారులకు మరింత చేరువగా సేవలందించాలనే ఉద్దేశంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీస్స్టేషన్ల పునర్ వ్యవస్థీకరణ చేశామన్నారు. గతేడాది కాలంగా అనేక రకాలైన సమావేశాలు, సర్వేలు, అధ్యయనాలు నిర్వహించి.. కొత్తగా 11 పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఒక్కో పీఎస్ పరిధిలో లక్ష నుంచి లక్షన్నర జనాభా ఉండేలా చూశామని తెలిపారు. ప్రజలకు పోలీసింగ్ సేవలు చేరువ చేసేందుకు వీటిని ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన పోలీస్స్టేషన్లలో కేసుల నమోదు ప్రారంభించామన్నారు. తాత్కాలిక భవనాల్లో ఏర్పాటు చేసిన కొత్త పీఎస్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సుమారు 15 రోజుల పట్టే అవకాశం ఉన్నదని, అవన్నీ సిద్ధమైన తర్వాత హోంమంత్రితోపాటు స్థానిక ప్రజాప్రతినిధుల చేతులమీదుగా లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు. కొత్త పీఎస్ల ఏర్పాటుతో సరిహద్దుల విషయంలో కొన్నాళ్లు చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఫిలింనగర్ కొత్త పీఎస్కు తాత్కాలిక భవనం అందించిన ఫిలింనగర్ సొసైటీకి పోలీసుశాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో కేసుల నమోదు ప్రక్రియతో పాటు సౌకర్యాలను కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు.
1250 పోస్టులు మంజూరు..
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన పోలీస్స్టేషన్ల కోసం 1250 కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసిందని సీపీ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం 30శాతం ఖాళీలు ఉన్నాయన్నారు. మొత్తం 6500 మందికి గానూ 4500 మంది కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఖాళీల భర్తీ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. బందోబస్తుల కోసం చాలామంది పోలీసులు వెళ్తుంటారని, ఫిర్యాదు చేసేందుకు స్టేషన్కు వచ్చేవారికి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో అన్ని పోలీస్స్టేషన్లలో అటాచ్ పేరుతో సిబ్బంది ఎక్కువగా ఉండటంతో సరైన సమాచారం లేకపోయేదన్నారు. ఇటీవల బదిలీలలో అటాచ్లో ఉన్న వారిని బదిలీ చేసి పోస్టింగ్లు వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వెస్ట్జోన్ డీసీపీ జోయల్ డేవిస్, బంజారాహిల్స్ ఏసీపీ శ్రీధర్, ఫిలింనగర్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్, ఫిలింనగర్ సొసైటీ కార్యదర్శి కాజా సూర్యనారాయణ, గోపాల్రావు, గౌతమ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
కొత్త ఠాణాల్లో ఎఫ్ఐఆర్ నమోదు షురూ..
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పునర్విభజన అనంతరం నూతనంగా ఏర్పడిన పోలీస్స్టేషన్లలో శుక్రవారం నుంచి విధులు మొదలయ్యాయి. జూన్ 2వ తేదీ నుంచి కొత్త ఠాణాల నుంచి ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం మొదలవుతుందని ఇదివరకే నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఇందులో భాగంగా కొత్త ఠాణాల్లో శుక్రవారం నుంచి ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 2011లో హైదరాబాద్లో సుమారు 68 లక్షల జనాభా ఉండగా, 2021 నాటికి అది 80 లక్షలకు పెరిగింది. దీంతోపాటు ప్రతి రోజూ హైదరాబాద్కు 10 నుంచి 15 లక్షల మంది రాకపోకలు కొనసాగిస్తారు. దీంతోపాటు 1987లో 8.76 లక్షల వాహనాలు ఉండగా, 2002లో 15.15 లక్షలు, 2020లో 70.97 లక్షలు, 2023 నాటికి 80.70 లక్షల వాహనాలు నగరంలో ఉన్నాయి. ఒకపక్క జనాభా విపరీతంగా పెరగడం, దానికి తగ్గట్టుగానే వాహనాలు కూడా భారీగా పెరగాయి. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 1.6 కోట్ల జనాభా ఉండగా.. 40 లక్షల మంది ప్రతి నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెగా సిటీ పోలీసింగ్కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మూడు కమిషనరేట్లలో కొత్త జోన్లు, కొత్త డివిజన్లు, కొత్త ఠాణాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్కు రెండు జోన్లు, 11 డివిజన్లు, 11 కొత్త పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశారు. అలాగే, 13 కొత్త ట్రాఫిక్ ఠాణాలు, ఐదు మహిళా ఠాణాలు కూడా ఏర్పాటయ్యాయి. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొత్తగా ఏర్పాటవుతున్న ఠాణాలు కొన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం ప్రారంభించగా, తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ముగిసేలోపు అన్ని ఠాణాల నుంచి ప్రజలకు సేవలందించే విధంగా ఆయా పోలీస్ కమిషనర్లు సన్నాహాలు చేస్తున్నారు. దశాబ్ది ఉత్సవాల ప్రారంభంతోనే హైదరాబాద్లో మెగాసిటీ పోలీసింగ్ ప్రారంభమయ్యింది.