చిక్కడపల్లి : బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని బీఆర్ఎస్ (BRS) ముషీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజవకర్గాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. అందిన సంక్షేమ పథకాల(Welfare Schemes) తో ప్రజలు సంతోషంతో ఉన్నారని, ప్రజలు మరోసారి తనను ఆశీర్వదించాలని కోరారు. ప్రచారంలో అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని వెల్లడించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్(CM KCR) సహకారంతో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో వీడీసీసీ రోడ్లు, నూతన మంచినీటి, డ్రైనేజీ పైప్లైన్ల నిర్మాణం చేపట్టానని గుర్తుచేశారు. మురికికూపంగా ఉన్న ముషీరాబాద్ను సుందరంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు.
ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ సేవాలందిస్తున్నానని వివరించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎం.రాకేశ్కుమార్, మాజీ కార్పొరేటర్లు ముఠా పద్మా, బీఎన్ శ్రీనివాస్ యాదవ్, ముఠా నరేశ్, ఎర్రం శ్రీనివాస్గుప్తా, గడ్డమీది శ్రీనివాస్, రవిశంకర్ గుప్తా, బత్తుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.