HomeHyderabadEnthusiasm Of Intellectuals And Professors With Namaste Telangana
మరింత సాధికారత..
చారిత్రక మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంతో సర్వత్రాహర్షం వ్యక్తమవుతున్నది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరిందని, తాజా రిజర్వేషన్ల బిల్లుతో మహిళలకు మరింత సాధికారత లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
మహిళా బిల్లు ఆమోదం.. చారిత్రాత్మక ఘట్టం
‘నమస్తే’తో మేధావులు, ప్రొఫెసర్ల మనోగతం
చారిత్రక మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంతో సర్వత్రాహర్షం వ్యక్తమవుతున్నది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరిందని, తాజా రిజర్వేషన్ల బిల్లుతో మహిళలకు మరింత సాధికారత లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ప్రొఫెసర్లు, మేధావులు తమ అభిప్రాయాన్ని ‘నమస్తే’తో పంచుకున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడం శుభపరిణామంటూ… అన్ని రంగాల్లో మహిళలకు అవకాశాలు లభిస్తాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మహిళలకు సముచిత స్థానం కల్పించారని, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు.
యావత్ భారత దేశంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం శుభ పరిణామం. మహిళల జీవితాల్లో మార్పునకు నాంది పలుకుతుంది. ఎమ్మెల్సీ కవిత, ఇతర మహిళామణుల పోరాట పటిమతో ఎట్టకేలకు మహిళా బిల్లు ఆమోదం పొందడం చారిత్రాత్మక ఘట్టం. మహిళా సాధికారతకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత పోరాటంతో మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడం సంతోషకరం.
– ప్రొఫెసర్ సరస్వతమ్మ, స్పెషల్ ఆఫీసర్, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం
సమాన అవకాశాలు..
తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ నేతృత్వంలో మహిళల గౌరవం పెంచేలా అనేక పథకాలను తీసుకొచ్చారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, షీటీమ్స్, భరోసా కేంద్రం వంటి పథకాలను తీసుకురావడమే కాకుండా స్థానిక కార్పొరేటర్ ఎన్నికల్లో 50 శాతం సీట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్దే. పార్లమెంట్లో మహిళా బిల్లు ఆమోదంతో మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు లభిస్తాయి.
-ప్రొఫెసర్ వారిజ, ప్రిన్సిపాల్, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం
మహిళల్లో పెరిగిన ఆత్మైస్థెర్యం
స్వాతంత్య్రం సిద్దించి 75 ఏండ్లు గడిచినా నేటికి పురుషులతో పాటు ఉన్నత విద్యనభ్యసించేందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం అంతంత మాత్రంగానే చెప్పవచ్చు. ఈ వివక్షను తొలగించి అమ్మాయిలు ఉన్నత విద్యలను అభ్యసించి దేశ విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా విదేశీ విద్యాపథకం అందించడం శుభ సూచకం. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా బిల్లుతో మహిళలు ఆత్మైస్థెర్యంతో ఆయా రంగాల్లో రాణించేలా ప్రోత్సహించినట్లుగా ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారత మహిళలు తమ సత్తా చాటేందుకు ఈ బిల్లు మహిళా లోకంలో ఉత్సాహాన్ని నింపింది.
– ప్రొఫెసర్ రాధ, లలిత కళాపీఠాధిపతి, తెలుగు యూనివర్సిటీ
దేశాభివృద్ధిలో మరింత భాగస్వామ్యం
మహిళా బిల్లు అమలుకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలపడం హర్షించదగిన విషయం. మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు చారిత్రాత్మకం. మహిళా బిల్లు చట్టబద్ధతకు దశాబ్దాలుగా సాగుతున్న రాజకీయ పరిణామాలకు కేంద్ర ప్రభుత్వం చరమగీతం పాడినందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వడం హర్షించదగిన విషయం. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న తరుణంలో ఈ బిల్లు వల్ల రాజకీయంగా మహిళలు చట్ట సభల్లో అడుగు పెట్టి తమ సత్తా చాటి దేశాభివృద్ధిలో మరింతగా భాగస్వామ్యం కావడంతో దేశం ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడేందుకు అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు విద్య, ఉద్యోగాల కల్పనలో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. ఇటీవల వైద్య విద్యబోధనలో విద్యార్థినులను ప్రోత్సహిస్తూ సీట్లు కేటాయించడం ఇందుకు నిదర్శనం. ఆలస్యం చేయకుండా త్వరితగతిన ఈ బిల్లును అమలు చేసేలా పాలకులు కృషి చేయాలి.
– డాక్టర్ వనజా ఉదయ్, నృత్య శాఖాధిపతి,తెలుగు విశ్వవిద్యాలయం
మహిళలకు తెలంగాణలో సముచిత గౌరవం
పార్లమెంట్లో మహిళా బిల్లు ఆమోదం పొందడం అభినందనీయం. తెలంగాణ రాష్ర ్టం ఏర్పడిన అనంతరమే మహిళలకు సముచిత గౌరవం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. కోఠి మహిళా కళాశాలను తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయంగా మార్చి.. మహిళలకు గౌరవం అందించిన సీఎం కేసీఆర్.. చరిత్రలో నిలిచిపోతారు. నేటి కాలంలో పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు ముందుకు దూసుకుపోతున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడంతో అన్ని రంగాల్లో అతివలకు అవకాశాలు లభిస్తాయి. మహిళల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఆలస్యం చేయకుండా ప్రభుత్వాలు త్వరగా అమలు చేయాలి.
-ప్రొఫెసర్ విజ్జులత, ఇన్చార్జి వీసీ, తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయం
త్వరగా అమలు చేయాలి
పార్లమెంట్లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వాలు త్వరగా అమలు చేయాలి. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. .గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు ప్రత్యేక మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. రాష్ట్రంలో మహిళలకు సముచిత గౌరవం కల్పించడంతో పాటు షీటీమ్స్, భరోసా కేంద్రాలతో భద్రత కల్పించడం అభినందనీయం. సబ్బండ వర్గాల అభ్యున్నతితో పాటు పేద మహిళల వివాహాలకు గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేని విధంగా కల్యాణ లక్ష్మితో లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి దేశానికే గర్వ కారణంగా తెలంగాణ నిలిచింది.
-డాక్టర్ శైలజ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం