బంజారాహిల్స్, ఏప్రిల్ 9: ఇరవయ్యేండ్లుగా జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో జరుగుతున్న అక్రమాలపై దర్యాప్తు జరగనున్నట్లు సొసైటీ చైర్మన్ రవీంద్రనాథ్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 51లోని జూబ్లీహిల్స్ కమ్యూనిటీ సెంటర్లో శనివారం జూబ్లీహిల్స్ సొసైటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సొసైటీ చైర్మన్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ, సొసైటీలో 20 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వారు అనేక అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించామని, ఆయా అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. తమ విజ్ఞప్తిని మన్నించిన ప్రభుత్వం సెక్షన్ 51 కింద విచారణకు ఆదేశించిందని తెలిపారు. విచారణ కోసం ప్రత్యేక అధికారిణిని నియమించిందన్నారు. ఇదిలా ఉండగా, సొసైటీ సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు కోరం లేకపోవడంతో గత నెలలో జరగాల్సిన సమావేశం శనివారం జరిగింది.
సొసైటీకి చెందిన కొన్ని బైలాస్లో మార్పులు చేసేందుకు సమావేశంలో తీర్మానాలు చేశారు. అధికారం మొత్తం అధ్యక్ష, కార్యదర్శులకే పరిమితం కాకుండా మేనేజింగ్ కమిటీకి అప్పగిస్తూ బైలాస్ను మార్చాలని సమావేశంలో నిర్ణయించారు. సొసైటీకి చెందిన విలువైన ఆస్తులను అతి తక్కువ అద్దెలకు ఇచ్చారని, ఆ లీజులను రద్దు చేసి మార్కెట్ ధరకు కేటాయించాలని నిర్ణయించామని అన్నారు. అక్రమంగా కేటాయించిన నర్సరీ స్థలాన్ని స్వాధీనం చేసుకుని సొసైటీ అవసరాల కోసం వినియోగిస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా, శనివారం జరిగిన సమావేశంలో కోరం లేకపోవడంతో ఈ సమావేశం వాయిదా వేయాలంటూ కొంతమంది సభ్యు లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అయితే, గతంలో జరిగిన అనేక సమావేశాల్లో 50 నుంచి 100 మంది ఉన్నా సమావేశాలు జరిగాయని. 424 మంది సభ్యులు హాజరయినా కొంత మంది ఉద్దేశ పూర్వకంగా సమావేశాన్ని అడ్డుకునేందుకు చూస్తున్నారన్నారు. ఈ సమావేశాన్ని జిల్లా సహకార శాఖ అధికారిణి పద్మ పర్యవేక్షించారు. హైకోర్టు ఆదేశాలతో సమావేశం మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశారు.