విద్యార్థుల తల్లిదండ్రులతో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు
ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం
‘మనబస్తీ-మనబడి’ సమీక్షలో మంత్రి తలసాని
సిటీబ్యూరో, మే 31(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి నిమిత్తం విద్యార్థుల తల్లిదండ్రులను మమేకం చేస్తూ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మాసబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం చేపట్టిన ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమంపై హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వారం రోజులలోగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో సూల్ మేనేజ్ మెంట్ (ఎస్ఎంసీ) కమిటీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులలో విద్యార్థుల తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయాలని మంత్రి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్, తరగతి గదుల మరమ్మతులు, విద్యుత్, తాగునీటి సౌకర్యం, ప్రహరీ గోడ నిర్మాణం వంటి మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.
విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యాబోధన జరగాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని మంత్రి తలసాని వివరించారు. ఇందుకోసం చేపట్టిన ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమం పనుల పర్యవేక్షణలో ఎస్ఎంసీలను భాగస్వాములను చేయడం ద్వారా పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. అదే విధంగా పనులు చేపట్టడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే స్థానిక ఎమ్మెల్యే లేదా, ఎమ్మెల్సీల దృష్టికి తీసుకెళ్ళి పరిషారానికి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు. డిప్యూటీ డీఈఓలతో వారి పరిధిలలో పాఠశాల్లో జరుగుతున్న పనులపై మంత్రి సమీక్షించారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా పనులు త్వరితగతిన చేపట్టి పూర్తి చేసేలా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ జరపాలని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు. సుల్తాన్ బజార్లో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను పూర్తి స్థాయిలో నిర్మించేందుకు ఒక స్వచ్ఛంద సంస్థ సిద్ధంగా ఉందని, ప్రభుత్వ పరంగా అనుమతులు కావాల్సి ఉందని ఎమ్మెల్యే రాజాసింగ్ పేరొనగా, బుధవారం మధ్యాహ్నం ఆ పాఠశాలను అధికారులతో కలిసి సందర్శించాలని సమావేశంలో నిర్ణయించారు.
ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఎమ్మెల్సీలు ప్రభాకర్, సురభి వాణీదేవి, జాఫ్రీ, జనార్దన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, సాయన్న, రాజాసింగ్, జాఫర్ హుస్సేన్, మౌజం ఖాన్, కలెక్టర్ శర్మన్, డీఈఓ రోహిణి, డిప్యూటీ డీఈఓలు తదితర ఇంజనీరింగ్ విభాగాల, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.