ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నం రూరల్, ఆగస్టు 15: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులోకి దూకి ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకొన్నాడు. లోన్యాప్ రికవరీ ఏజెంట్ల వేధింపులే ఇందుకు కారణమని కుటుంబసభ్యులు ఆరోపించారు. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన విష్ణువర్ధన్రెడ్డి శేరిగూడలోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ భారత్ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఇబ్రహీంపట్నం చెరువు కట్ట తూము వద్ద అందరూ చూస్తుండగానే చెరువులోకి దూకాడని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. అక్కడ ఉన్న పర్యాటకులు అతనిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ అతని ఆచూకీ దొరకలేదు. మంగళవారం కూడా గాలింపు చర్యలు కొనసాగించనున్నారు.