HMDA | సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా ఏర్పాటైన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో (హెచ్ఎండీఏ) ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు మెట్రో పాలిటన్ కమిషనర్ చర్యలు చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఔటర్ రింగు రోడ్డు దాటి.. చుట్టూ ఉన్న 7 జిల్లాల పరిధిలోకి విస్తరిస్తోంది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రస్తుతం ఉన్న హెచ్ఎండీఏ పరిధిని రీజినల్ రింగు రోడ్డు వరకు విస్తరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పరిధి గణనీయంగా పెరుగుతుండటంతో అదేస్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని ఉన్నత స్థాయిలో జరిగిన సమీక్షల్లో గుర్తించారు.
ప్రధానంగా హెచ్ఎండీఏ భూములు వివిధ ప్రాంతాల్లో సుమారు 8వేల ఎకరాల వరకు ఉండగా, ఏటా భవన నిర్మాణ అనుమతులు, లే అవుట్ల అనుమతులు వేల సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో భద్రతాపరమైన ఏర్పాట్లు చాలా కీలకమని గుర్తించారు. ప్రస్తుతం ఒక డీఎస్పీ స్థాయి అధికారి, ఒక సీఐ, మరొక ఎస్ఐ, పదుల సంఖ్యలోనే కానిస్టేబుళ్లు, హోంగార్డులు విధుల్లో ఉన్నారు. వీరితో హెచ్ఎండీఏ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని సమర్థవంతంగా నిర్వహించలేమని, ఐపీఎస్ ర్యాంకు కలిగిన అధికారి, అదనపు సిబ్బంది ఉండాలని అధికారులు నిర్ణయించారు.
ఇప్పటికే జీహెచ్ఎంసీలో ఐపీఎస్ ర్యాంకు అధికారి నేతృత్వంలో ఎన్స్ఫోర్స్మెంట్ విభాగం ఉన్నట్లే, హెచ్ఎండీఏలోనూ అదే స్థాయిలో పోలీసుల బలగాలతో ఎన్ఫోర్స్మెంట్ వింగ్ను ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. డీఐజీ స్థాయి ర్యాంక్ అధికారి నుంచి మొదలుకొని.. మొత్తం 250 మందికిపైగా పోలీసు శాఖకు చెందిన అధికారులు, సిబ్బందిని హెచ్ఎండీఏకు తీసుకురానున్నారు. ఈ మేరకు ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు తెలిపారు. పోలీసు బలగాలతో కూడిన ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఎంత బలంగా ఉంటే అంతే పటిష్టంగా క్షేత్ర స్థాయిలో హెచ్ఎండీఏ పరిరక్షణతో పాటు అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లల్లో అక్రమాలపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని అర్బన్ ఫారెస్ట్రీ విభాగంలో బదిలీలు చేపట్టారు. అటవీ శాఖ నుంచి డిప్యుటేషన్పై వచ్చి, వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారిని బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఔటర్ రింగు రోడ్డుతో పాటు నగరంలోని హుస్సేన్సాగర్, పలు పార్కులు, నగర శివారు ప్రాంతాల్లో చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ పార్కులను విజయవంతంగా చేపట్టడంలో హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అధికారులు క్షేత్ర స్థాయిలో కీలకంగా పనిచేశారు.
హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా ఉన్న ఔటర్ రింగు రోడ్డు 158 కి.మీ. పొడవునా పచ్చదనం పెంపొందించేందుకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ, పచ్చదనం ఉండేలా అర్బన్ ఫారెస్ట్రీ విభాగం నిర్వహణను చేపట్టింది. అయితే, చాలా ఏండ్లుగా డిప్యుటేషన్పై ఉన్న అటవీ శాఖ అధికారులను బదిలీ చేసినట్లు ఆదేశాలు వచ్చినా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈ అంశాన్ని పెండింగ్లో పెట్టినట్లు సమాచారం.