బంజారాహిల్స్, మే 1: ‘జూబ్లీహిల్స్ రోడ్ నం.9లో ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాం… ’అంటూ వారంరోజుల కిందట హైడ్రా అధికారుల ప్రకటన.. ‘సుమారు 1600 గజాల స్థలంలోకి ఎవరూ ప్రవేశించకుండా లక్షలాది రూపాయల వ్యయంతో ఫెన్సింగ్ ఏర్పాటు చేశాం’ అంటూ ప్రెస్నోట్ విడుదల. నగరం నడిబొడ్డున సుమారు 40కోట్ల విలువైన రెవెన్యూశాఖ ఆధీనంలోని యూఎల్సీ స్థలాన్ని, జీహెచ్ఎంసీకి చెందిన పార్కు స్థలాన్ని రక్షించారని కాలనీవాసులు సంతోషపడ్డారు. అయితే వారి సంతోషం తాత్కాలికమే అయింది. శుక్రవారం ప్రైవేటు వ్యక్తులు దర్జాగా హైడ్రా వేసిన ఫెన్సింగ్ను తొలగించి ప్రభుత్వ స్థలాన్ని చదును చేయడం ప్రారంభించడంతో స్థానికులు షాక్కు గురయ్యారు.
ఒకవైపు ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నిస్తుండడంతో పాటు హైకోర్టులో సైతం వివాదాలు నడుస్తున్న తరుణంలో హైడ్రా వేసిన ఫెన్సింగ్ను తొలగించిన వ్యవహారంపై కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షేక్పేట మండలం సర్వే నంబర్ 403, టీఎస్ నంబర్ 1, బ్లాక్ -హెచ్, వార్డు 9లోని సత్వ ఎన్క్లేవ్, లహోటీ లేవుట్ మద్యన ఉన్న సుమారు 1600 గజాల స్థలంపై ఎన్నో ఏళ్లుగా ప్రైవేటు వ్యక్తులు కన్నేయడం, వారిపై క్రిమినల్ కేసులు నమోదవడం తెలిసిందే.
ఈ క్రమంలో ఇటీవల అధికారపార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుటుంబంసభ్యుల పేరుతో కొంతమంది వ్యక్తులు ఈ స్థలం వద్దకు వచ్చి ప్రహరీ నిర్మాణాన్ని అడ్డుకున్న వైనంపై ఇటీవల ‘నమస్తే’ పత్రికలో ‘సర్కార్ స్థలంపై కబ్జాదారుల కన్ను..’ పేరుతో కథనాలు ప్రచురించడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. గత నెల 23న స్థలం చుట్టూ హైడ్రా ఆధ్వర్యంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. పార్కుతో పాటు రెవెన్యూ స్థలంలోకి ఎవరూ ప్రవేశించకుండా నాలుగు వైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. హైడ్రా చొరవతో తమ కాలనీలోని పార్కుకు ఆక్రమణల భయం పోయిందని కాలనీవాసులు ఆనందపడ్డారు.
అయితే శుక్రవారం తెల్లవారుజామునుంచి కొంతమంది ప్రైవేటు వ్యక్తుల ఆదేశాలతో దర్జాగా ఫెన్సింగ్ను తొలగించడంతో పాటు స్థలంలోకి జేసీబీలతో వచ్చి చదును చేసే పనులు ప్రారంభించారు. ఈ విషయంపై కాలనీవాసులు ప్రశ్నించగా జీహెచ్ఎంసీకి చెందిన అధికారుల అనుమతితో పార్కు స్థలాన్ని చదును చేస్తున్నామని, పక్కనున్న ఓ భవన యజమాని ఇంట్లో ఫంక్షన్ కోసం పనులు చేస్తున్నామని చెప్పడంతో వారంతా అవాక్కయ్యారు. హైడ్రా వేసిన ఫెన్సింగ్ను తొలగించడమే కాకుండా ప్రైవేటు వ్యక్తుల ఫంక్షన్కు వచ్చే వాహనాల పార్కింగ్ కోసం పార్కును చదును చేయడమేంటని కాలనీవాసులు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు.