సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): వేసవి మొదలు కావడంతో విద్యుత్కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. శీతాకాలం ప్రభావం ఫిబ్రవరి చివరి నాటికి ఉండగా, మార్చి మొదటి వారం నుంచే ఒక్కసారిగా రోజు వారీ విద్యుత్ వినియోగం పెరిగింది. రోజు వారీ వినియోగం ఫిబ్రవరి చివరి నాటికి 48 మిలియన్ యూనిట్లు ఉండగా, మార్చి మొదటి వారం నుంచి క్రమంగా పెరుగుతూ 58 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. ప్రభుత్వ,ప్రైవేటు కార్యాలయాలు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వీటికి తోడు కొత్తగా పరిశ్రమలు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థలు, నివాస గృహాలు పెద్ద మొత్తంలోనే ఏర్పాటవుతున్నాయి. ఈ కారణంగా విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతూనే ఉంది.
శనివారం వీకెండ్ కావడం, రెండో శనివారం ప్రభుత్వ సెలవు కావడంతో విద్యుత్ వినియోగం తక్కువగా నమోదైనప్పటికీ, శుక్రవారం వరకు 58 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం, పీక్ అవర్ డిమాండ్ 2800 మెగావాట్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇదే డిమాండ్ ఈ నెలాఖరు వరకు 65 నుంచి 70 యూనిట్ల దాకా చేరుకొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎంత డిమాండ్ పెరిగినా దానికి అనుగుణంగా సరఫరా చేసే సామర్థ్యాన్ని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పెంచుకుంటోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్తో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో పవర్ ఐల్యాండ్స్ను ఏర్పాటు చేసింది. ఫలితంగా ఒకవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోయినా, మరో వైపు నుంచి విద్యుత్ సరఫరా అందేలా నెట్వర్క్ను ఏర్పాటు చేశారు.