సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. కోర్ సిటీతో పాటు నగర శివారు ప్రాంతాల్లో పట్టణీకరణ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో మౌలిక వసతుల్లో ఎంతో కీలకమైన విద్యుత్ సరఫరాను ఇందుకు అనుగుణంగా అందించాల్సిన అవసరం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థపై ఉన్నది. ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే గ్రేటర్ పరిధిలో రికార్డు స్థాయిలో కరెంటు డిమాండ్ నమోదైంది. దానికి అనుగుణంగానే క్షేత్ర స్థాయిలో ఉన్నతాధికారులు, ఉద్యోగులంతా మెరుగైన సరఫరాను అందించేందుకు శ్రమించారు. కాగా, పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా కరెంటు అవసరాలను తీర్చేందుకు క్షేత్రస్థాయిలో కీలకమైన విద్యుత్ లైన్ల విభాగాలను పునర్విభజన చేసేందుకు టీజీఎస్పీసీఎల్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా కమిటీని నియమించింది. గ్రేటర్ మెట్రో జోన్ పరిధిలో అధ్యయనం కోసం కమిటీ సభ్యులుగా మెట్రో జోన్ సీజీఎం నర్సింహాస్వామి, రంగారెడ్డి జోన్ సీజీఎం ఆనంద్, మేడ్చల్ జోన్ సీజీఎం సాయిబాబా, సైబర్ సిటీ సర్కిల్ ఎస్ఈ వెంకన్నను నియమించారు.
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తెలంగాణ రాష్ట్రంలోని 15 జిల్లాల్లో విస్తరించి ఉంది. మొత్తం కనెక్షన్లు కోటి 11 లక్షలు ఉండగా, అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ జోన్ల పరిధిలోనే సుమారు 60 లక్షలు ఉన్నాయి. ప్రతి నెలా కొత్తగా వేల సంఖ్యలోనే వినియోగదారులు చేరుతున్నారు. వీరందరికీ అంతరాయం లేని సరఫరాను అందించాలంటే.. కరెంటు లైన్ల వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరమున్నది. ఈ నేపథ్యంలో సమగ్రంగా అధ్యయనం చేసేందుకే డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ కమిటీని నియమించారు. విద్యుత్ లైన్ల విభాగాన్ని పునర్విభజన చేయడంతో పాటు సబ్ ఇంజినీర్లు, సెక్షన్ కార్యాలయాల పరిధిలోని అధికారుల పని విధానాలను నిర్ణయించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై ఈ కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి.. జూన్ 3 వరకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తంగా క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన అంశాలపై ఈ కమిటీ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి.. నివేదికను రూపొందించి సీఎండీకి అందజేయాల్సి ఉంటుంది.