సిటీబ్యూరో, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ జోన్ పరిధిలో వచ్చే నెల నుంచి విద్యుత్ బస్సులను నడిపించాలని ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది. కొత్తగా వచ్చే విద్యుత్ బస్సులను నగరంలో ఏయే మార్గాలలో నడిపించాలి.? ఏ మార్గంలో నడిపిస్తే ఆక్యుపెన్సీ పెరుగుతుంది.? పాత మార్గాలలో వీటిని నడిపించాలా.? కొత్త మార్గాలను ఎంపిక చేయాలా.? ఇప్పటికే మెట్రో రైళ్లు ఉన్న మార్గాలు కాకుండా ప్రత్నామ్నాయంగా ఉన్న మార్గాలను ఎంపిక చేయాలా.? వాటిపై ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు.? అన్న కోణాలలో యాజమాన్యం జోరుగా ఆన్లైన్ సర్వే నిర్వహిస్తున్నది.
ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఆరు నుంచి ఏడాదిలోగా దాదాపు వెయ్యికి పైగా విద్యుత్ బస్సులను నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఒలెక్ట్రా కంపెనీతో కూడా ఆర్టీసీ యాజమాన్యం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. నగరంలో నడిపించే విద్యుత్ బస్సులు నాన్ ఏసీగా ఉంటాయి. అందుకు సంబంధించిన నమూనా బస్సును ఇప్పటికే ఒలెక్ట్రా విడుదల చేసింది. అన్ని సక్రమంగా ఉంటే నగరంలో తొలి విడుతగా 28 బస్సులను తీసుకురానున్నారు.
కాలుష్యం తగ్గించేందుకు..
నగరంలో వాయు కాలుష్యం, శబ్ధ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు నగర ప్రజలకు ప్రాణవాయువు పెంచాలన్న లక్ష్యంతో ఆర్టీసీ యాజమాన్యం విద్యుత్ బస్సులను తీసుకొస్తుంది. అయితే, ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న కాలం చెల్లిన బస్సులను స్క్రాప్కు పంపించి, వాటి స్థానంలో విద్యుత్ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు.