సిటీబ్యూరో, మార్చి 2(నమస్తే తెలంగాణ): రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛా వాతావరణంలో జరిగేలా, నగదు పంపిణీని అరికట్టేందుకు విసృ్తత చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఎన్ఫోర్స్మెంట్ జిల్లా నోడల్ అధికారులతో కమాండ్ కంట్రోల్లో నోటిఫికేషన్ ముందు చేపట్టాల్సిన చర్యల గురించి తగు ఆదేశాలు జారీ చేశారు.
మద్యం నియంత్రణకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని అక్రమ మద్యాన్ని పట్టుకుని సీజ్ చేయాలని ఎక్సైజ్ అధికారిని ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా ప్రలోభాలకు తావివ్వకుండా నిర్దుష్టమైన చర్యలు తీసుకోవాలని సెంట్రల్ కస్టమ్స్ అధికారులను ఆదేశించారు. వేర్ హౌసెస్ మ్యాపింగ్ వివరాలను తెలియజేయాలని రొనాల్డ్ రాస్ అన్నారు. ఎన్ఫోర్స్ మెంట్కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
జనవరి 1 నుంచి బ్యాంక్ క్యాష్ విత్ డ్రాయల్ వివరాలు అదే విధంగా యూపీఏ వివరాలు ఇవ్వాలని ఎస్ఎల్బీఓ అధికారిని రొనాల్డ్ రాస్ ఆదేశించారు. నిర్దేశించిన పరిమితి మించి నగదు క్యాష్ డ్రాయల్ వివరాలను తెలియజేయాలన్నారు. నారోటిక్ డ్రగ్స్ సంబంధించిన సస్పెక్ట్, ఇంతకు ముందు జరిగిన కేసులపై ఫోకస్ పెట్టాలని నారోటిక్ అధికారులను ఆదేశించారు.
ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్లను ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు తర్వాత ఏర్పాటు చేసే సందర్భంలో మిగతా శాఖల సిబ్బంది పేర్లను పోలీస్ శాఖకు పంపించాలని రవాణా, ఎక్స్ సైజ్ శాఖ అధికారులను కోరారు. సమావేశంలో డిప్యూటీ పోలీస్ కమిషనర్ లా అండ్ ఆర్డర్ విక్రమ్ సింగ్ మాన్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, ఎన్నికల వ్యయం నోడల్ అధికారి శరత్ చంద్ర, ఆయా శాఖల ఐటీ, నారొటిక్, ఎస్ఎల్బీసీ, ఆర్బీఐ, ఎక్సైజ్, ఆయా శాఖల ఎన్ ఫోర్స్మెంట్ నోడల్ అధికారులు పాల్గొన్నారు.
సీవరేజ్ డైవర్షన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం కమిషనర్ శేరి లింగంపల్లి, ఖైరతాబాద్ జోన్లలో జోనల్ కమిషనర్లు స్నేహ శబరీష్, వెంకటేష్ దోత్రె, ఇతర అధికారులతో కలిసి కమిషనర్ చెరువుల సుందరీకరణ, మురుగునీరు మళ్లింపు పనులను పరిశీలించి వేగంగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముందుగా శేరిలింగంపల్లి జోన్లో రంగులాల్కుంటలో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సీఎస్ఆర్ కింద సీవరేజ్ డైవర్షన్, అప్రోచ్ క్లియరెన్స్, ఫెన్సింగ్, వివిధ రకాల అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని లేక్స్ ఎస్ఈని కమిషనర్ ఆదేశించారు.
గచ్చిబౌలిలోని బార్క్స్కుంట గేట్తో పాటు ఫెన్సింగ్, చెరువు క్లీనింగ్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్లో చెరువు సీవరేజ్ డైవర్షన్ పనులు ఇతర అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ రాక్ గార్డెన్ సమీపంలో ఉన్న షికారి చెరువులో చేపట్టిన మురుగు మళ్లింపు ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. కమిషనర్ వెంట అడిషనల్ కమిషనర్ లేక్స్ శివ కుమార్ నాయుడు, సీఈ దేవానంద్, ఎస్ఈలు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.