సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): అభ్యర్థు ల ప్రచారంతోపాటు వారి ఎన్నికల వ్యయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని నోడల్ అధికారులకు జిల్లా ఎన్నికల పరిశీలకులు సూచించారు. జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులుగా వ్యవహరిస్తున్న సెంథిల్ కుమార్ (హైదరాబాద్) అమిత్ శుక్లా (సికింద్రాబాద్) శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎక్స్పెండేచర్ మానిటరింగ్ కమిటీ, ఎంసీఎంసీ, ఎక్సైజ్, పోలీస్, ఐటీ, డీజీసీ, ఈఈఎం, తదితర నోడల్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ఆయా కమిటీల ద్వారా నిర్వహిస్తున్న విధులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీపై దృష్టి సారించాలన్నారు. భారీ లావాదేవీలతో పాటు యూపీఐ చెల్లింపులను సైతం పరిశీలించాలన్నారు. పోలింగ్కు రెండు మూడు రోజుల ముందు ప్రలోభాలకు తెరలేపే అవకాశం ఉన్నందున అధికారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. అత్యంత ఎకువ మద్యం విక్రయిస్తున్న షాపులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో అనుమతులు లేని ప్రకటనలు, బల్ ఎస్ఎంఎస్లు, సోషల్ మీడియాలో ప్రచారాలను గుర్తించి, ఆయా అభ్యర్థుల ఖర్చులలో జమ చేయాలన్నారు.
సీ- విజిల్లో వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత సమయంలో ఎప్పటికప్పుడు పరిషరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంసీఎంసీ నోడల్ అధికారి ముర్తూజా అలీ, ఐటీ నోడల్ అధికారి నర్సింగ్ రావ్, ఎన్నికల వ్యయ పర్యవేక్షణ నోడల్ అధికారి శరత్ చంద్ర, ఎల్డీఎం, ఎక్సైజ్, పోలీస్, ఇన్కమ్ టాక్స్, సీ -విజిల్ తదితర అధికారులు పాల్గొన్నారు.
మేడ్చల్, మే 3 (నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో శుక్రవారం ఆన్లైన్ ద్వారా మైక్రో అబ్జర్వర్లను నియమించారు. వీరికి ఈ నెల 7న జేఎన్టీయూ కూకట్పల్లిలో శిక్షణ నిర్వహిస్తున్నట్టు ఎన్నికల జనరల్ పరిశీలకురాలు ప్రియాంకా శుక్లా, మేడ్చల్- మల్కాజిగిరి ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డీఆర్వో హరిప్రియ, డీఈవో విజయకుమారి పాల్గొన్నారు.
సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలు, కంటోన్మెట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన డీఆర్సీ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లను శుక్రవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఇతర సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.