హయత్నగర్, జూన్ 5: ఆభరణాల కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్ మండలం, తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూర్కు చెందిన సంరెడ్డి సత్తెమ్మ(82) కుమారులు, కూతుళ్లకు వివాహం జరగడంతో ఒంటరిగా నివాసముంటున్నది. శనివారం జరిగిన బంధువుల వివాహానికి సత్తెమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి హాజరైంది. ఆదివారం మధ్యాహ్నం వనస్థలిపురంలోని ప్రశాంత్నగర్లో తన కుమారుడి ఇంటి వద్ద నుంచి ఆమె తొర్రూర్కు వచ్చింది. రాత్రి పడుకున్నాక గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి సత్తెమ్మపై దాడికి పాల్పడి 23 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం ఇంటి తలుపులు తీసి ఉండటంతో చుట్టుపక్కల వాళ్లు గమనించి వెళ్లి చూడగా రక్తపు మడుగులో సత్తెమ్మ కనిపించింది. విషయం తెలుసుకున్న రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్, ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, హయత్నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, డీఐ నిరంజన్లు, సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంట్లోని బీరువాలో దాచిన 11 తులాల బంగారు నగలు అట్లాగే ఉన్నాయి. క్లూస్ టీమ్ బృందం, డాగ్ స్కాడ్ బృందం పరిసర ప్రాంతాల్లోనూ పరిశీలించింది.
8 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు…
ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించిన హయత్నగర్ పోలీసులు సీసీ కెమెరాలు, స్థానికుల సమాచారంతో సాయత్రం 6 గంటల్లోపు కేసును ఛేదించారు. ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ సాయిశ్రీ కేసు వివరాలను వెల్లడించారు. నారాయణపేట జిల్లా, దామరగిద్ద గ్రామానికి చెందిన ఎండ్ల రాకేశ్ (28) తొర్రూర్లోని అతని సోదరుడు చంద్రశేఖర్ నూతనంగా ఇంటి నిర్మాణం చేపడుతుండగా అక్కడే ఉంటూ నిర్మాణ పనులు చూసుకుంటున్నాడు. మహబూబాద్ జిల్లా, గార్ల భయ్యారానికి చెందిన గుండపాటి లలిత(34) అక్కడికి కూలీ పనులకు వస్తుంటుంది. ఈనేపథ్యంలో రాకేశ్, లలితకు మధ్య పరిచయం ఏర్పడింది. సంరెడ్డి సత్తెమ్మ ఇంటిలోనే లలిత అద్దెకు నివాసముంటుంది. లలిత వద్దకు వస్తున్న రాకేశ్, సత్తెమ్మకు కూడా పరిచయమయ్యాడు. సత్తెమ్మ వృద్ధురాలు కావడంతో బయటి చిన్నచిన్న పనులకు రాకేశ్ను పంపిస్తుండేది. రాకేశ్, లలిత ఇద్దరికీ సత్తెమ్మకు చెందిన 34 తులాల బంగారు నగలపై కన్నుపడింది. పథకం ప్రకారం నెల రోజుల క్రితమే ఆమె వద్ద నుంచి బంగారు నగలు కాజేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. రాకేశ్, లలిత ఇద్దరూ.. ఆదివారం రాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సత్తెమ్మ నగలు కొట్టేసేందుకు ప్రణాళికను రూపొందించారు. ముందుగా రాకేశ్, సత్తెమ్మ నిద్రిస్తున్న బెడ్రూంలోకి వెళ్లి దిండుతో ఆమె ముఖంపై గట్టిగా అదిమిపట్టి ఊపిరి ఆడకుండా చేశాడు. లలిత కాళ్లు కదపకుండా పట్టుకుంది. సత్తెమ్మ చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత ఆమె ఒంటిపై ఉన్న 23 తులాల బంగారు నగలను తీసుకొని పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేయగా అనుమానితులుగా ఉన్న రాకేశ్, లలితను విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద నుంచి 23 తులాల బంగారు నగలు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సమావేశంలో ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ఎస్ఓటీ ఏసీపీ వెంకన్న నాయక్, హయత్నగర్ సీఐ వెంకటేశ్వర్లు, డీఐ నిరంజన్, ఎస్ఐ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. తుర్కయాంజాల్ వ్యవసాయ రైతు సహకార సంఘం మాజీ చైర్మన్ సంరెడ్డి బాల్రెడ్డి తల్లి సంరెడ్డి సత్తెమ్మ మృతిచెందారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కిషన్రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కుటుంబసభ్యులను పరామర్శించారు.