బడంగ్పేట, అక్టోబర్13 : మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే మహేశ్వరం నియోజకవర్గాన్ని మరో హైటెక్ సిటీగా అభివృద్ధి చేస్తానని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ సామయాదిరెడ్డి గార్డెన్లో వివిధ కాలనీల అసోసియేషన్ అధ్యక్షులతో శుక్రవారం మంత్రి సమావేశం నిర్వహించారు. కాలనీ అసోసియేషన్ నాయకులు తమ అభిప్రాయాలను తెలిపారు. కాలనీల అభివృద్ధి కోసం ౨౪ గంటలు కష్ట పడుతున్న సబితమ్మకు పూర్తిగా అండగా ఉంటామని కాలనీ వాసులు శపథం చేశారు. కాలనీలు అభివృద్ధి కావాలంటే సబితమ్మ మళ్లీ గెలవాలని కాలనీ వాసులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంపూర్ణ సహకారంతో నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. విద్యారంగానికి రూ.౨౮౦ కోట్లు ఖర్చు చేశామని, రెండు డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నాలుగు కోట్లతో ఏర్పాటు చేసిన జిల్లా గ్రంథాలయం ఎంతో మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు చదువు కోవడానికి వేదిక అయిందన్నారు. రూ.౩౨ కోట్లతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. కందుకూరులో బీసీ సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ కళాశాల, మీర్పేటలో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో రూ.౪౦ కోట్లతో చెరువుల సుందరీకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. రూ.౧౨౦౦ కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయబోతున్నామని, కందుకూరులో రూ.౧౭౬ కోట్లతో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశామని వివరించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి కందుకూరు వరకు రూ.౬౬౦౦ కోట్లతో మెట్రో రైలు రాబోతుందన్నారు. నియోజకవర్గంలో ౪౯౧ పరిశ్రమలు వచ్చాయని, వీటితో ౪౨ వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నియోజకవర్గంలోని ప్రతి గడపకు చేరాయన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు కౌసిక్ రెడ్డి, ప్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కామేశ్ రెడ్డి, దిండు భూపేశ్ గౌడ్, కార్పొరేటర్లు సిద్దాల లావణ్య బీరప్ప, రాంచందర్, సిద్దాల బీరప్ప, నవీన్ గౌడ్,బీఆర్ఎస్ నాయకులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.