సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్సాగర్..మరోవైపు గ్రేటర్ చుట్టూ మణిహారంలా మారిన ఔటర్ రింగురోడ్డు..ఇలా రెండింటి మధ్యలో దేశంలోనే అతి పెద్ద అక్వేరియం, ఏవియరీ (పక్షి శాల) కేంద్రాల నిర్మాణానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ శ్రీకారం చుట్టింది. మరో వైపు ఐటీ కారిడార్- శంషాబాద్ ఎయిర్పోర్టు మార్గ మధ్యలో సుమారు 85 ఎకరాల విస్తీర్ణంలో కొత్వాల్గూడ ఎకో పార్కు నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
ఇవే కాకుండా మరిన్ని ప్రత్యేక అంశాలను జోడిస్తూ నగర వాసులకు అద్భుతమై వినోద కేంద్రాన్ని నగర శివారు ప్రాంతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. ఇందుకోసం సుమారు రూ.300 కోట్లను వ్యయం చేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు ప్రతిపాదనలు రూపొందించి పనులు చేపట్టారు. ప్రస్తుతం పలు పనులు పురోగతిలో ఉన్నాయి. ఇటీవలే మంత్రి కేటీఆర్ సైతం ఈవిషయాన్ని ట్విట్టర్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీని నిర్మాణం పనులు పూర్తయితే హైదరాబాద్ మహానగరానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
పూర్తి కావొచ్చిన బోర్డు వాక్ నిర్మాణం..
ఎత్తయిన కొండలతో కూడిన ప్రాంతంలో అక్కడి సహజ వనరులను ధ్వంసం చేయకుండా పలు నిర్మాణాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగా 2.50 కి.మీ దూరంతో కూడిన బోర్డు వాక్ను నిర్మాణం పనులు దాదాపు పూర్తి కావొచ్చాయని, అతి పెద్ద పక్షిశాల (ఏవియరీ)కి సంబంధించిన ప్రహరీ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. దీంతో కొండ రాళ్లతో ఉన్న ప్రాంతాన్ని చదును చేస్తున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఈ పనులకు సంబంధించిన నమూనా చిత్రాలను, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల చిత్రాలను అధికారులు ప్రత్యేకంగా విడుదల చేశారు. రకరకాల అంశాలతో నగర వాసులకు వినోదం,విజ్ఞానాన్ని అందించేలా ఎకోహిల్ పార్కును డిజైన్ చేశామని, ప్రస్తుతం రిసార్ట్, ఫుడ్ కోర్టు, అడ్వెంచర్ జోన్ల ఏర్పాటుకు టెండర్లు సైతం పిలిచి పనులు అప్పగిస్తున్నామని వివరాలను వెల్లడించారు. ఈ పార్కులో అదనంగా ల్యాండ్ స్కేపింగ్, వ్యూ పాయింట్స్, అడ్వెంచర్ జోన్, ఆక్వా మైరీన్ పార్కు, ఔటర్ రింగు రోడ్డు మీదుగా ఒక వైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు వీలుగా సస్పెన్షన్ బ్రిడ్జి, లగ్జరీ రిసార్టుతో పాటు మినీ కన్వెన్షన్ సెంటర్, ఇన్పినిటీ పూల్, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు ఉంటాయని అధికారులు తెలిపారు.