సిటీబ్యూరో: ఎస్సై వేషమేసి..పోలీస్ శాఖలో నేరుగా ఉద్యోగాలిపిస్తానని మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాల్ కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా దొంతికుంట తండాకు చెందిన కేదవాత్ సోమ్ల నాయక్ ఇంటర్ వరకు చదివాడు. ఆర్మీలో చేరి ఆరు నెలల శిక్షణ తీసుకొని మధ్యలో వదిలేశాడు. 2004లో అసోం రైఫల్స్కు ఎంపికైనా.. శిక్షణ సమయంలో అనారోగ్యంతో మధ్యలోనే వదిలేసి వచ్చాడు.
ఆ తరువాత ఉమ్మడి ఏపీలో పోలీస్ రిక్రూట్మెంట్కు ప్రయత్నించి విఫలమయ్యాడు. జీవనోపాధి కోసం హైదరాబాద్లో కారు డ్రైవర్గా పనిచేసుకుంటున్నాడు. యూనిఫామ్ డ్యూటీ చేయాలనే కోరికతో 2012లో పోలీసు యూనిఫామ్ కుట్టించుకొని, తాను ఎస్సైనని కొందరికీ, కానిస్టేబుల్నని మరికొందరికీ చెప్పుకుంటూ తిరగడం మొదలు పెట్టాడు. అతడి స్వగ్రామం, ఆ చూట్టు పక్కల ప్రాంతాల ప్రజలు నిజంగానే సోమ్ల నాయక్ ఎస్సై అని నమ్మడం మొదలు పెట్టారు.
ఈ క్రమంలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారిని లక్ష్యంగా చేసుకున్న సోమ్ల..పోలీసుల ఉద్యోగాలు డైరెక్ట్గా ఇప్పిస్తానంటూ నమ్మిస్తూ అమాయకుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఇలా రూ. 11 లక్షల వరకు వసూలు చేసిన సోమ్లనాయక్కు.. రూ. 2 లక్షలు ఇచ్చిన బంజారాహిల్స్కు చెందిన గౌరిశంకర్కు ఇతడి వ్యవహారంపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ ఎస్సై భాగోతం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. యూనిఫాం, క్యాప్ ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.