సిటీబ్యూరో, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ): రెండు దశాబ్దాల్లో పదమూడు కంటే ఎక్కువ సార్లు హైదరాబాద్ పరిసరాల్లో భూప్రకంపనలు సంభవించాయని పలు భూభౌగోళిక అధ్యయనాల్లో వెల్లడైంది. టర్కీలో వరుస భూకంపాలు, ఉత్తర భారతంలో సంభవిస్తున్న భూకంపాలతో నగరంలోని స్థితిగతులను విశ్లేషించింది. నగరం నుంచి 35-50 కిలోమీటర్ల దూరంలో ఉన్న భౌగోళిక పరిస్థితులను ప్రత్యేక పరికరాల ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించగా.. నగరంలోనూ భూప్రకంపనలు కలిగాయని, భూ ఉపరితలం నుంచి 28కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాలు నిక్షిప్తమై ఉన్నట్లుగా వెల్లడి కాగా, వాటి ప్రభావం నగర మౌలిక, భవనాలపై ఏమాత్రం లేదని స్పష్టమైంది.
భూ అంతర్భాగంలోని పొరల్లో ఏర్పడిన ఒత్తిడి కారణంగా సాధారణ భూప్రకంపనలు సంభవించగా.. గడిచిన 20ఏళ్లలో 13 కంటే ఎక్కువ సార్లు భూకంప తరంగాలు వెలువడినట్లుగా ఎన్జీఆర్ఐ తాజా విశ్లేషణలో తేలింది. ముఖ్యంగా వికారాబాద్, జూబ్లీహిల్స్, ఘట్కేసర్, ఇబ్రహీంపట్నం, ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చినట్లు పేర్కొన్నారు. నగరం చుట్టూరా 35-65 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలు ప్రాంతాల్లో సేకరించిన సిస్మోగ్రాఫిక్ డేటా ఆధారంగా భూకంపాలు సంభవించినట్లుగా నిర్ధారించారు.
ప్రస్తుతం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం దాదాపు మూడు బిలియన్ల ఏండ్ల కిందట ఏర్పడిన ఆర్కియన్ క్రస్ట్ లక్షణాలను కలిగి ఉన్నట్లుగా భావిస్తారు. నాలుగు పొరలపై విస్తరించిన హైదరాబాద్ డెక్కన్ అగ్నిపర్వత కాలం నాటి ఆధారాలు ఉన్నట్లుగా ఎన్జీఆర్ఐ పరిశోధకులు వెల్లడించారు. అయితే దిగువన ఉండే పొరలు ఎగువన ఉండే దాని కంటే దట్టంగా విస్తరించి ఉన్నాయని తేలింది. జూబ్లీహిల్స్, రాజాపేట్, ఇబ్రహీంపట్నం మధ్య ప్రాంతంలో పైభాగంలోని పొర మందం 5-10 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుందని, ఇబ్రహీంపట్నం నుంచి మహబూబ్ నగర్ వరకు ఉన్న ప్రాంతాల్లో గుర్తించిన మధ్య పొర మందం 4-7కిలోమీటర్లు, మూడో పొర మందం 6.1-12.5కిలోమీటర్లతో వికారాబాద్ నుంచి మహబూబ్ నగర్, జూబ్లీహిల్స్ నుంచి ఘట్కేసర్ వరకు ఉండగా.. చిట్టచివరి పొర మందం ఇబ్రహీంపట్నం వద్ద 8.7కిలోమీటర్లు ఉంటే, హత్నూర్ వద్ద 20.6 కిలోమీటర్లు లోతు వరకు భూమి పొరలు విస్తరించి ఉన్నాయి. నగరం చుట్టూరా పొరల మందంలో ఈ స్థాయిలో వ్యత్యాసాలను గుర్తించగా వీటన్నింటినీ క్రోడీకరించి తరంగాల వేగం, ఉత్పన్నమైన సాంద్రతలతో భూమి లోపల సంభవించిన భూప్రకంపాలను విశ్లేషించారు.
నగరం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్నో భౌగోళిక మార్పులు చోటు చేసుకున్నాయి. 1843, 1876, 1982, 1993లలో సంభవించిన భూప్రకంపనలను అంచనా వేయగా.. తక్కువ తీవ్రతతో ఏర్పడినట్లుగా నిర్ధారించారు. 2022లో గచ్చిబౌలి ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రత కూడా 3.3-4.8 మధ్యనే ఉంటుందని ఈ ఫలితాలను ఆధారంగా చేసుకొని సిటీ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టాలని ఎన్జీఆర్ఐ పరిశోధకులు సూచిస్తున్నారు. సూక్ష్మస్థాయి భూప్రకంపనాలతో వచ్చే నష్టం కూడా ఉండదని, మౌలిక నిర్మాణాలపై ఏమాత్రం ప్రభావం చూపదని పేర్కొన్నారు.