సిటీబ్యూరో, జనవరి 17(నమస్తే తెలంగాణ)/ బంజారాహిల్స్ : పట్టుమని 15 ఏండ్లు కూడా లేవు. ప్రమాద రూపంలో ఆ బాలుడిని మృత్యువు కబళించింది. పుట్టెడు దుఃఖంలోనూ ఆ బాలుడి తల్లిదండ్రులు ఔదార్యం చూపారు. బ్రెయిన్ డెడ్ అయిన కుమారుడి అవయవాలను దానం చేసి ఆరుగురికి పునర్జన్మనిచ్చారు. కానరాని లోకానికి వెళ్లినా.. వేరొకరి శరీరాల్లో కొడుకు సజీవంగా తమ కళ్లెదుటే ఉంటాడన్న ఉద్దేశంతో ఆ దంపతులు చూపిన సహృదయతను పలువురు అభినందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా నక్కలదిన్నెకు చెందిన బసిరెడ్డి నరసింహారెడ్డి, తులసి దంపతుల కుమారుడు బసిరెడ్డి అభితేశ్కు జనవరి 13న తలకు గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్కు తరలించారు.
అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మూడు రోజులుగా చికిత్స అందించినప్పటికీ ఆరోగ్యంలో ఎటువంటి పురోగతి లేకపోవడంతో వైద్యులు జనవరి 16న రాత్రి 10 : 26 గంటలకు బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. విషయం తెలుసుకున్న జీవన్దాన్ సంస్థ సభ్యులు అవయవదానం ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు వివరించారు.
కొడుకు పోయాడన్న పుట్టెడు దుఃఖంలోను బాలుడి తల్లిదండ్రులు అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. దీంతో అభితేశ్కు సంబంధించిన రెండు కిడ్నీలు, గుండె, కాలేయం, రెండు ఊపిరితిత్తులను సేకరించి ఆరుగురు నిరుపేద రోగులకు అమర్చారు. మంగళవారం మధ్యాహ్నం 3:15 నిమిషాలకు కేవలం 6 నిమిషాల 15 సెకండ్ల సమయంలోనే అపోలో దవాఖాన నుంచి నిమ్స్ దవాఖానకు తరలించారు. బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరసింహరాజు ఆధ్వర్యంలో గ్రీన్ చానెల్ నిర్వహించారు. పునర్జన్మను ప్రసాదించిన బాలుడి తల్లిదండ్రులను జీవన్దాన్ సంస్థ అభినందించింది.