దుండిగల్, జూన్ 24: దారి దోపిడీ కేసును 24 గంటల్లోనే ఛేదించారు దుండిగల్ పోలీసులు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.37.97 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ ఏసీపీ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బౌరంపేట్లో మల్లికార్జునరావు దుర్గా ఆటోమోబైల్ గ్యారేజీని నిర్వహిస్తున్నాడు. తన వద్ద మెకానిక్గా పనిచేసే మల్లేశ్తో పాటు అకౌంటెంట్గా పనిచేస్తున్న సాయిరాంలను మాదాపూర్లోని తన మిత్రుడి వద్ద నుంచి రూ.40 లక్షలు తీసుకురావాల్సిందిగా పురమాయించాడు. మల్లికార్జునరావు మిత్రుడి వద్ద డబ్బులు తీసుకొని.. శుక్రవారం మల్లేశ్, సాయిరాంలు తిరుగు ప్రయాణమయ్యారు.
బౌరంపేటలోని జేకే గార్డెన్ వద్ద బైక్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు వీరి కారును అడ్డగించి డబ్బులు ఉన్న బ్యాగ్తో పారిపోయారు. సీసీ కెమెరాలు, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ప్రధాన నిందితుడు జాలా అనిల్కుమార్కు మల్లేశ్తో పరిచయమున్నది. అనిల్ అతడికి దోపిడీ పథకాన్ని వివరించాడు. మోర్త శివచరణ్, వెంకటరమణరాజు, ఏపూరిరాజు దోపిడీ పథకంలో భాగస్వాములయ్యారు. మాదాపూర్లో డబ్బులు తీసుకుని తిరుగు ప్రయాణమైనప్పటి నుంచి మల్లేశ్ తాము ఎక్కడెక్కడి నుంచి వస్తున్నది అనిల్కు ఫోన్లో చేరవేశాడు. అప్పటికే మోర్త శివచరణ్, వెంకటరమణరాజు, ఏపూరిరాజు బైక్తో ప్రగతినగర్ అంబేద్కర్చౌరస్తా వద్ద వేచి ఉన్నారు. కారు అక్కడికి రాగానే దానిని అనురించి, జేకే గార్డన్ వద్ద అడ్డగించి డబ్బులతో ఊడాయించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసి..సొత్తు స్వాధీనం చేసుకున్నారు.