ముషీరాబాద్/ చిక్కడపల్లి, ఏప్రిల్ 29 : భారీ వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం తెల్లవారుజామున ఈదురు గాలులతో భారీ వర్షం కురియడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లుకూలిపోగా నాలాలు పొంగి ఇండ్లలోకి వరద నీరు చేరింది. ముఖ్యంగా అడిక్మెట్ డివిజన్ పద్మకాలనీ వరద నీటితో నిండిపోయింది. స్థానికంగా చేపడుతున్న నాలా స్లాబు నిర్మాణ పనుల కారణంగా వరద నీరు పద్మకాలనీని ముంచెత్తింది. గంటపాటు కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గంలోని పద్మకాలనీ, బాపూజీనగర్, జాంబవినగర్, అరుంధతీనగర్లు జలమయమయ్యా యి. పద్మకాలనీలో వరద ఉధృతికి కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తభాలు విరిగిపడటంతోపాటు ట్రాన్స్ఫార్మన్ నాలాలో పడిపోయింది. ఇండ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో స్థానికులు గంటల పాటు ఇండ్లకే పరిమితమయ్యారు. ఉదయం ఒక్కసారిగా ఈదురు గాలులు వీస్తూ భారీ వర్షం కురియడంతో విద్యు త్ సరఫరా నిలిపోయి కాలనీలు, బస్తీల్లో అంధకారం అలుముకుంది. ఈదురు గాలులతో భారీ వర్షం కురియడంతో నియోజకవర్గంలోని పలు చోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నెలకూలాయి.
అత్యవసర బృందాలు, పారిశుధ్య సిబ్బంది, ఇంజినీరింగ్ విభాగం, విద్యుత్ శాఖల అధికారులు వెంటనే రంగంలోకి దిగి విరిన చెట్లు, స్తంభాలను తొలగించి సాయంత్రానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ సర్కిల్-15 డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య పద్మకాలనీలో పర్యటించి పరిస్థితిని వాకబు చేశారు. జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రత్యేక వాహనాలు, సిబ్బందిని రంగంలోకి దింపి కాలనీలో పెద్ద ఎత్తున పేరుకుపోయిన బురద, చెత్తను తొలగించి పరిస్థితి చక్కదిద్దారు. జీహెచ్ఎంసీ ఈఈ శ్రీనివాస్, ట్రాన్స్కో డీఈ కమల్కుమార్ తమ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.
డివిజన్లోని అరుంధతినగర్ బస్తీలో వరదనీరు చేరకుండా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అధికారులను అదేశించారు. శనివారం ఉదయం కురిసిన వర్షానికి అరుంధతినగర్లో వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠాగోపాల్ అరుంధతినగర్ బస్తీలో అధికారులతో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డుపై నుంచి వరద నీరుచేరిందని, వరద నీరు చేరకుండా శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. బీఆర్ఎస్ నాయకుడు ముఠా జయసింహ, ముఠా నరేశ్, అధికారులు శ్యామ్ సుందర్, బీఆర్ఎస్ నాయకులు, ఎర్రం శ్రీనివాస్గుప్తా, పున్న సత్యనారాయణ, రాజ్కుమార్, హన్మంతు, స్థానిక బస్తీ అధ్యక్షుడు మెరుగు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
విస్తరణ, స్లాబు నిర్మాణ పనులు కొనసాగుతున్నందు వల్లనే వరద సమస్య తలెత్తిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. భారీ నాలా కూలిపోవడం వరద ముంపునకు కారణమైందన్నారు. వరద సరిస్థితిని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. వచ్చే జూన్ నాటికి నా లాపై స్లాబు నిర్మాణ పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వరద సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.