సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): న్యూ ఇయర్ వేడుకలకు డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని స్టేట్ ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 30 ఎల్ఎస్డీ బ్లాట్స్, 3.59 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. స్టేట్ టాస్క్ఫోర్స్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి కథనం ప్రకారం.. విశాఖపట్టణానికి చెందిన ముస్నుకొండ సత్యనారాయణ కొంతకాలం హైదరాబాద్లో ఉన్నాడు. అతడిపై రెండు డ్రగ్స్కు సంబంధిత కేసులు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం గోవాలో ఉంటున్న అతడు ఏజెంట్లను నియమించుకొని డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. హైదరాబాద్లో ఉంటున్న అశోక్ అనే వ్యక్తిని ఏజెంట్గా నియమించుకున్నాడు. న్యూ ఇయర్ వేడుకలు రావడంతో ఎల్ఎస్డీ బ్లాట్స్, ఎండీఎంఏ డ్రగ్స్ను పంపించాడు. ఒక్కో గ్రామ్ రూ.2500 ఉండగా.. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ధరను పెంచి రూ.5 వేలకు విక్రయించాలని పథకం వేశారు. విశ్వసనీయ సమాచారంతో అశోక్ను ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు కొండపూర్లో అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం అతడిని శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
బడంగ్పేట, డిసెంబర్ 29: గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఓ వ్యక్తి మహేశ్వరం పోలీసు స్టేషన్ పరిధిలో పట్టుబడ్డాడు. ఇన్స్పెక్టర్ మధుసూదన్ కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన సురేంద్ర మాలిక్ (67) మహేశ్వరంలోని ఐడీఏ మాంఖాల్ తెలంగాణ ధర్మకాంట వద్ద గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. నిఘా పెట్టిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి విక్రయిస్తున్న సురేంద్ర మాలిక్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు నేరం అంగీకరించాడు. నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తుండటంతో డ్రగ్స్ విక్రయం, వినియోగదారులపై మూడు కమిషనరేట్ల పోలీసులు నిఘా పెంచారు. ఎక్సైజ్ పోలీసులు కూడా అన్ని ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. నగరంలోకి డ్రగ్స్ రాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్న్యూ), ఆసిఫ్నగర్ పోలీసులు కలిసి డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని గురువారం అరెస్ట్ చేశారు. హెచ్న్యూ డీసీపీ చక్రవర్తి గుమ్మి కథనం ప్రకారం.. బోరబండకు చెందిన గంజి వెంకటేశ్ జూబ్లీహిల్స్లోని గిగ్గిల్ వాటర్స్ పబ్లో డీజే ప్లేయర్గా పనిచేస్తున్నాడు. లంగర్హౌస్కు చెందిన పౌల్ స్టీవెన్ మార్కెటింగ్లో పని చేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి సులువుగా డబ్బు సంపాదించేందుకు వేర్వేరు ప్రాంతాల నుంచి హాష్ ఆయిల్ను కొనుగోలు చేస్తున్నారు. నగరంలో బాగా తెలిసిన వారికి మాత్రమే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. హెచ్న్యూ పోలీసులు అందించిన సమాచారం మేరకు.. బుధవారం ఇద్దరు నిందితులను ఆసిఫ్నగర్ ఎక్స్ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 45 బాటిళ్ల హాష్ ఆయిల్, రెండు సెల్ఫోన్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 3 లక్షలు ఉంటుందని డీసీపీ తెలిపారు. వీరిద్దరిని విచారించగా.. 14 మంది వినియోగదారుల పేర్లు వెలుగులోకి వచ్చాయని తెలిపారు.