హైదరాబాద్ : ముంబయి నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా ఎక్కువ జరుగుతోందని నగర సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. పలు ముఠాలు యువతులకు మాదక ద్రవ్యాలు అలవాటు చేసి వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారని తెలిపారు. మాదక ద్రవ్యాల వ్యవహారంలో గోవా పోలీసులు ఎలాంటి సాయం చేయలేదని పేర్కొన్నారు. ఆ రాష్ట్ర పోలీసుల సహకారంతో డ్రగ్స్ సరఫరాను అడ్డుకుంటామని సీవీ స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల ముఠాపై ముంబయి పోలీసులకు సమాచారమిచ్చామని తెలిపారు. ముంబయి పోలీసుల సాయంతో అక్కడ కూడా దాడులు నిర్వహిస్తామని చెప్పారు.
హైదరాబాద్ నగరంలో మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తూ విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. వారి నుంచి 204 గ్రాముల ఎండీఎంతో పాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ముంబయిలో మాదక ద్రవ్యాలకు సంబంధించి మరో గ్యాంగ్ను అరెస్టు చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నుంచి ముంబయికి గంజాయిని తరలిస్తుండగా వారిని పట్టుకున్నామన్నారు. వారి నుంచి 110 కిలోల గంజాయిని టాస్క్ఫోర్స్ పోలీసులు సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ కేసులో భార్యాభర్తలిద్దరూ పరారయ్యారని, వారి కోసం గాలిస్తున్నట్లు వివరించారు.