సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): గోవా డ్రగ్ డాన్ ఎడ్విన్కు గంజాయి, చెరస్ సరఫరా చేసిన బాలమురుగన్, దానిని హిమాచల్ ప్రదేశ్లోని మనాలీకి చెందిన నేగీ నుంచి సమకూర్చుకునేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇటీవల బాలమురుగన్ను పోలీసులు విచారించి, అతడి నెట్వర్క్ గూర్చి ఆరా తీశారు. ఈ క్రమంలోనే మనాలీకి చెందిన చండే ఆమ్ అలియాస్ చండే నేగి, చెరస్ షార్క్ పేరు బయటకు వచ్చింది. ఇతడు ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తూ టూరిస్టులతో పరిచయాలు పెంచుకొని మనాలిలో గంజాయి, చెరస్, హాష్ తదితర మత్తు పదార్థాలను విక్రయించాడు.
హిమాలయ పర్వతాలలో పండించే గంజాయికి విదేశీయుల నుంచి మంచి గిరాకీ ఉండటంతో అతడికి బాగా కలిసొచ్చింది. 2002లో అక్కడి పోలీసులు అరెస్టు చేసి, 107 కిలోల చెరస్ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ రూ. 20 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇతడి డ్రగ్ స్మగ్లింగ్ గూర్చి తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రహస్యంగా డ్రగ్స్ దందా చేస్తూ, బాలమురుగన్ లాంటి వాళ్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది.