Drugs | హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు ఉడోకో స్టాన్లీని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. స్టాన్లీ కేసు దర్యాప్తులో మరో కీలక నిందితుడు ఓక్రా వ్యవహారం బయటపడింది. డ్రగ్స్ కేసులో అరెస్టైన ఓక్రా.. గత మూడేండ్ల నుంచి గోవా జైల్లో ఉంటున్నాడు. అయితే హైదరాబాద్లో స్టాన్లీ కోసం ఎవరెవరు పని చేశారన్న వారి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామని హైదరాబాద్ పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టాన్లీ కాంటాక్ట్ లిస్ట్లో పలువురి ప్రముఖుల పేర్లు ఉన్నాయి.
డ్రగ్స్ పెడ్లర్ స్టాన్లీ అంతర్జాతీయంగా మత్తు సామ్రాజ్యాన్నే స్థాపించాడు. మంగళవారం టీఎస్ న్యాబ్, హెచ్న్యూ, పంజాగుట్ట పోలీసులు స్టాన్లీని అరెస్టు చేసి.. రూ.8 కోట్ల విలువజేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అతడి వ్యక్తిగత జీవితంతో పాటు నేర సామ్రాజ్య విస్తరణపై పోలీసుల దర్యాప్తులో అనేక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నైజీరియాకు చెందిన 43 ఏండ్ల ఇవులా ఉకోడా స్టాన్లీ 2009లో భారత్లో అడుగు పెట్టాడు. ముంబైలో జూవెల్ అనే వ్యక్తి సాయంతో రెడీమేడ్ బట్టల వ్యాపారాన్ని ప్రారంభించి, అక్కడి నుంచి గోవాలోని కండోలిమ్కు చేరుకున్నాడు. తోటి నైజీరియన్లను పరిచయం చేసుకొని డ్రగ్స్ దందాను నేర్చుకున్నాడు. తొలుత గోవాకు వచ్చే పర్యాటకులు, సందర్శకులకు డ్రగ్స్ను విక్రయించడం ప్రారంభించాడు. గత 15 ఏండ్ల కాలంలో మత్తు పదార్థాల విక్రయం, సరఫరా చేస్తూ దేశ, విదేశాలకు తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు.