సిటీబ్యూరో, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరితోపాటు డ్రగ్స్ వినియోగిస్తున్న ముగ్గురినిఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.12లక్షల విలువజేసే 100 గ్రాముల హెరాయిన్, 6 సెల్ఫోన్లు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ కథనం ప్రకారం… రాజస్థాన్కు చెందిన బజరంగ్ బిష్ణోయి అలియాస్ బజరంగ్(21), మహేందర్ బిష్ణోయి(19) కలిసి ఉపాధి కోసం నగరానికి వలసొచ్చారు. వీరిద్దరూ నేరేడ్మెట్లో నివాసముంటూ గ్యాస్ స్టౌ రిపేయిర్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. వచ్చిన సంపాదన సరిపోవడం లేదు. సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో బజరంగ్ బిష్ణోయి రాజస్థాన్లో తనకు పరిచయం ఉన్న ఓ వ్యక్తి ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసి, తన దగ్గరి బంధువైన మహేందర్ బిష్ణోయి సహకారంతో నగరంలో విక్రయించడం మొదలు పెట్టాడు. బజరంగ్ సూచన మేరకు మహేందర్ డ్రగ్ పార్శిళ్లను రాజస్థాన్ నుంచి నగరానికి ప్రైవేటు, ఆర్టీసీ, లారీల్లో తరలిస్తున్నాడు. ఈ విధంగా తీసుకొచ్చిన డ్రగ్స్ను బజరంగ్ నగరంలో తనకు పరిచయం ఉన్న వినియోగదారులకు నేరుగా, రాపిడో ద్వారా విక్రయిస్తాడు.
ఈ క్రమంలోనే సోమవారం కుషాయిగూడ ప్రాంతంలో డ్రగ్స్ను విక్రయిస్తుండగా.. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ బృందం కుషాయిగూడ పోలీసులతో కలిసి బజరంగ్, మహేందర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారితో పాటు డ్రగ్స్ను కొనుగోలు చేసిన రాజస్థాన్కు చెందిన అభిషేక్ బిషోని(19), పుక్రాజ్ బిషోని(20), శిషుపాల్ బిషోని(19)ని కూడా అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.12 లక్షల విలువజేసే 100 గ్రాముల హెరాయిన్, 6 సెల్ఫోన్లు, ఒక ద్విచక్రవాహనం, రూ.820 నగదును స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును కుషాయిగూడ పోలీసులకు అప్పగించారు.