సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): గోవా కేంద్రంగా.. నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఒక యువతితో పాటు మరో యువకుడిని షాద్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 11గ్రాముల ఎండీఎంఏ, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. షాద్నగర్ ఇన్స్పెక్టర్ ప్రతాప్లింగం కథనం ప్రకారం.. యాదగిరిగుట్ట, ఆలేరు ప్రాంతానికి చెందిన కొండెం ప్రియాంక రెడ్డి అలియాస్ ప్రియా(29) ఆర్క్టెక్చర్. వృత్తిపరంగా నగరానికి వలసొచ్చి, మాదాపూర్, సిలికాన్ వ్యాలీ ప్రాంతంలోని న్యూ పాష్ప్లేస్ గర్ల్స్ హాస్టల్లో ఉంటున్నది. ఏపీలోని విజయనగరం ప్రాంతానికి చెందిన శ్రీతేజ(29) టెక్ మహేంద్రలో పనిచేస్తున్నాడు. వృత్తిపరంగా నగరానికి వలస వచ్చిన అతడు మాదాపూర్లోని శ్రీలక్ష్మి బాలాజీ మెన్స్ హాస్టల్లో ఉంటున్నాడు.
వ్యసనాలకు అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఇద్దరు కలిసి నగరంలో డ్రగ్స్ విక్రయించడం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా గోవాలో స్థానికంగా ఉండే శివ, భరత్కుమార్రెడ్డి ద్వారా రష్యాకు చెందిన అనా అనే మహిళ వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి, నగరంలో విక్రయిస్తారు. వీరి వద్ద నుంచి నగరంలోని కొండాపూర్కు చెందిన దినేశ్, డయానొ, గిరీశ్, అఖిల్ డ్రగ్స్ కొనుగోలు చేస్తారు. ఈ క్రమంలోనే ఇటీవల గోవాకు వెళ్లి వచ్చిన ప్రియా, శ్రీతేజ గురువారం రాత్రి షాద్నగర్ లోని యమ్మి హోటల్ వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్ఐ దేవకి తన సిబ్బందితో కలిసి యువతీ, యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. నిందితుల వద్ద నుంచి 11గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వారిద్దరినీ అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు నగరంలో వారి వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారితో పాటు గోవాలో మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న నిందితుల కోసం వేట మొదలు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.