బంజారాహిల్స్, జనవరి 5: ఫ్రెండ్స్తో న్యూ ఇయర్ పార్టీలో పీకల దాకా మద్యం సేవించి కారు నడుపుతూ రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమైన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బంజారాహిల్స్ రోడ్ నం. 3లోని గ్రీన్ మాస్క్ ఎదురుగా జనవరి 1న తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. ప్రమాదానికి కారణమైన విద్యానగర్కు చెందిన బీటెక్ విద్యార్థి కొడాలి ప్రణవ్ (21)ను గురువారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న మరో నిందితుడు పొలసాని శ్రీవర్ధన్ (21) తీవ్ర గాయాలతో సన్షైన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇలా జరిగింది..
ప్రణవ్, శ్రీవర్ధన్ గత నెల 31న మాదాపూర్లో తన స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పార్టీలో భాగంగా పీకలదాకా మద్యం సేవించిన కొడాలి ప్రణవ్, శ్రీవర్ధన్ కారులో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఇంటికి బయలుదేరారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, పార్క్ హయత్ మీదుగా పంజాగుట్ట వైపు వెళ్తుండగా బంజారాహిల్స్ రోడ్ నం. 3లోని గ్రీన్ మాస్క్ సమీపంలోకి రాగానే రోడ్డుదాటుతున్న భీమవరపు ఈశ్వరి(55)తో పాటు అవిడి శ్రీను(50)ను ఢీకొట్టాడు. ఈశ్వరి, శ్రీను అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో కారు నడిపిస్తున్న ప్రణవ్తో పాటు పక్కనే కూర్చున్న శ్రీవర్ధన్కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. నిందితులపై 304(2) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో తీవ్రంగా గాయపడిన ప్రణవ్కు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా.. మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. అతడితో పాటు కారులో ఉన్న శ్రీవర్ధన్ కూడా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలడంతో ఇద్దరిని నిందితులుగా చేర్చారు.
రాయల్ టిఫిన్స్ నిర్వాకం వల్ల గందరగోళం
జనవరి 1న తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటనలో బంజారాహిల్స్ రోడ్ నం. 3లోని రాయల్ టిఫిన్స్ నిర్వాకం బయటకు వచ్చింది. వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో గాల్లోకి ఎగిరిన ఈశ్వరి, శ్రీను మృతదేహాలు రాయల్ టిఫిన్స్ ప్రాంగణంలో పడిపోయాయి. ఈ ప్రమాదం గురించి వెంటనే పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాల్సిన రాయల్ టిఫిన్స్ నిర్వాహకులు.. అక్కడపడిపోయిన మృతదేహాలను రోడ్డు మీదకు చేర్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రాత్రంతా హోటల్ తెరిచి ఉండటంతో చాలామంది అక్కడ తమ వాహనాలు పార్కింగ్ చేసినట్లు సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన జరిగిన తీరును అంచనా వేసేందుకు అక్కడికి వెళ్లిన పోలీసులు, క్లూస్ టీమ్ సిబ్బందిని గందరగోళానికి గురిచేసేలా రాయల్ టిఫిన్స్ నిర్వాహకులు వ్యవహరించినట్లు అధికారులు తెలిపారు. దీంతో హోటల్ను సీజ్ చేసిన అధికారులు.. కేసు నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. గతంలో కూడా రాయల్ టిఫిన్స్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదాలు జరిగాయని, బాటసారుల ప్రాణాలు పోయినా ఇదే విధంగా నిర్వాహకులు వ్యవహరించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.