కేపీహెచ్బీ కాలనీ, జనవరి 10 : హైటెక్సిటీ నుంచి కేపీహెచ్బీ కాలనీ జేఎన్టీయూహెచ్ వైపు వెళ్తున్న కారు అతివేగంతో దూసుకొచ్చింది. అదుపుతప్పిన కారు ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఉన్న ఫుట్పాత్పై బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు కారులో ప్రయాణిన్నారు. హైటెక్సిటీ నుంచి కేపీహెచ్బీ కాలనీకి వస్తుండగా.. కాలనీ 7వ ఫేజ్ సమీపంలో ఫ్లైఓవర్ బ్రిడ్జిపై కారు ఒక్కసారిగా అదుపుతప్పి ఫుట్పాత్పై బోల్తా పడింది.
ఆ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారును నడిపిస్తున్న వ్యక్తి మద్యం సేవించి వాహనం నడిపినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మద్యం మత్తులో, నిర్లక్ష్యంగా కారును నడిపిన దైదా క్రాంతి (27) పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్డుపై కారు బోల్తాపడటంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి రోడ్డు పైనుంచి కారును తొలగించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేశారు.