సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయి ఫేజ్-1లోని సంతోష్నగర్ వద్దనున్న 1600 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైన్కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. ఎస్ఆర్డీపీ పనుల్లో భాగంగా నల్గొండ-ఓవైసీ డౌన్ర్యాంపు ఆలైన్మెంట్లో ఉన్న సంతోష్నగర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులకు ఇబ్బందులు పడకుండా ఈ జంక్షన్ పనులు చేయనున్నారు. ఈ పనులు ఈ నెల 3వ తేదీ బుధవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 4వ తేదీ గురువారం ఉదయం 6 గంటలకు వరకు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.
ఈ 24 గంటల పాటు పలు ప్రాంతాలలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. మిరాలం, కిషన్బాగ్, అల్జుబైల్కాలనీ, సంతోష్నగర్, వినయ్నగర్, సైదాబాద్, చంచల్గూడ, అస్మాన్గఢ్, యాకుత్పుర, మాదన్నపేట్, మహబూబ్ మాన్షన్, రియాసత్నగర్, ఆలియాబాద్, బొగ్గులకుంట, అఫ్జల్గంజ్, నారాయణగూడ, అడిక్మెట్, శివంరోడ్, నల్లకుంట, చిలుకలగూడ, దిల్సుఖ్నగర్, బొంగుళూరు, మన్నెగూడ ప్రాంతాలలో నీటి సరఫరా ఉండదని, వినియోగదారులు తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు విజ్ఞప్తి చేశారు.