అల్లాపూర్, మే 10:ఉమ్మడి అల్లాపూర్ డివిజన్ వ్యాప్తంగా తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. కొన్ని చోట్ల పైపులైన్లు లీకేజీ కావడంతో నీరు కలుషితమవుతున్నది. దీంతో ఆ నీటిని తాగిన వారు వ్యాధుల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు. మరికొన్ని చోట్ల లోఫ్రెజర్ కారణంగా సక్రమంగా నీటి సరఫరా కావడం లేదు. అయినా అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. తాజాగా గాయత్రినగర్ కాలనీలో లిటిల్ స్టార్ స్కూల్ సమీపంలోని నివాసితులకు గత పదిరోజుల నుండి మురుగువాసనతో తాగునీరు సరఫరా అవుతున్నది.
సమస్యను పలుమార్లు జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ‘ఇదిగో వస్తాం, అదిగో చూస్తాం’ అంటూ జాప్యం చే స్తున్నారని కాలనీవాసులు వాపోతున్నారు. ఎట్టకేల్లకు నాలుగు రోజుల క్రితం వచ్చిన జలమండలి సిబ్బంది, పైపులైన్ లీకేజీని గుర్తించి రోడ్డు తవ్వి పైపులైన్కు మరమ్మతు చేయకుండా వదిలేశారు. దీంతో కలుషిత నీటిని తాగడం వ ల్ల వ్యాధుల బారిన పడుతున్నామని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు వేసవి కాలం కావడంతో భూ గర్భ జలాలు అడుగంటిపోయాయని, మరోవైపు సక్రమం గా తాగునీరు సరఫరా గాక, వచ్చిన నీరు కలుషితం కావం తో ట్యాంకర్లపైనే అధారపడాల్సిన దుస్థుతి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పైపులైన్ లీకేజీలు అరికట్టి నాణ్యమైన తాగునీరు సరఫరా చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.