సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : ఒకవైపు తీవ్రమైన ఎండలు..మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తాగునీటికి యమ డిమాండ్ ఏర్పడింది. ప్రధానంగా వెస్ట్జోన్లో వాటర్ ట్యాంకర్లకు విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే జలమండలి కీలక నిర్ణయం తీసుకున్నది. వచ్చే నెల మొదటి వారం నుంచి 24 గంటల పాటు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ వెల్లడించారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో వేసవి కార్యాచరణ, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాపై గురువారం జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డితో కలిసి దానకిశోర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
గతేడాదితో పోలిస్తే ఈ సారి ట్యాంకర్ల డిమాండ్ 50 శాతం పెరిగిందని దానకిశోర్ వివరించారు. వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్ను తట్టుకునేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రోజుకు 9వేల ట్రిప్పుల నీరు సరఫరా చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు వివరించారు. వాణిజ్య అవసరాలకు నీరు సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా నైట్షిప్ట్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఫిల్లింగ్ స్టేషన్ నుంచి వాణిజ్య వినియోగదారుల కోసం 300 అదనపు ట్రిప్పులు సరఫరా చేస్తామన్నారు. ఇందుకోసం 250 కొత్త ట్యాంకర్లు సమకూర్చుకుంటున్నట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ, ఇతర మార్గాల ద్వారా 250 మంది డ్రైవర్లను తీసుకుంటామన్నారు.
ఏప్రిల్ మొదటి వారం నాటికి అదనంగా ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు దానకిశోర్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు, జీహెచ్ఎంసీ అవతల ఓఆర్ఆర్ పరిధిలో కూడా భవిష్యత్ అవసరాల నిమిత్తం 7 డివిజన్లలో డివిజన్కు ఒకటి చొప్పున 14 మొత్తం 20 కొత్త ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ట్యాంకర్ బుక్ చేసిన 24 గంటల్లో నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ ఆలస్యమైతే ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించాలన్నారు. ఈ సమీక్షలో జలమండలి ఈడీ సత్యనారాయణ, డైరెక్టర్లు ప్రవీణ్కుమార్, రవికుమార్, స్వామి తదితరులు పాల్గొన్నారు.