మియాపూర్, మార్చి 19 : భారీ వర్షంతో శేరిలింగంపల్లి జోన్లో రహదారులు జలమయమయ్యాయి. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానతో అక్కడక్కడా రహదారులపై నీరు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాలలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ లైన్లు దెబ్బతిని సరఫరాకు ఆటంకాలెదురయ్యాయి. భారీ వర్షం నేపథ్యంలో డీఆర్ఎఫ్ బృందాలు చందానగర్, శేరిలింగంపల్లి సర్కిల్లో ముమ్మరంగా సహాయక చర్యలను చేపట్టాయి. శనివారం రాత్రే రంగంలోకి దిగి హఫీజ్పేట్, ఆల్విన్ చౌరస్తా, పాపిరెడ్డి కాలనీ సహా పలు ప్రాంతాలలో రహదారులపై కూలిన చెట్ల తొలగింపు, నీటి నిల్వ ప్రాంతాలలో సహాయక చర్యలతో పరిస్థితులను చక్కదిద్దాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలలోని రహదారులు నిండిపోయాయి.
మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాలలో స్థానిక ప్రజాప్రతినిధి శ్రీకాంత్ పర్యటించారు. కాగా ఆదివారం ఉదయం జోనల్ కమీషనర్ శంకరయ్య చందానగర్ సర్కిల్లో పర్యటించారు. ఆదిత్యనగర్, హఫీజ్పేట్ బ్రిడ్జి, ఆల్విన్ క్రాస్రోడ్డులలో రహదారులపై భారీగా నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలను చేపట్టాలని సర్కిళ్ల అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సర్కిల్ వైద్యాధికారి డాక్టర్ కార్తీక్ ఉన్నారు.
మియాపూర్, మార్చి 19 : అకాల భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా విభాగాలు సమన్వయంతో పని చేయాలని విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మాన్ సూన్, ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ బృందాలు యుద్ధ ప్రాతిపదికన అవసరమైన ప్రాంతాలలో సహాయక చర్యలను చేపట్టాలన్నారు. ఆదివారం ఆయన ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలను గుర్తించి ముందస్తు అక్కడ ముంపు సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వరద నీరు సాఫీగా వెళ్లిపోయేలా నాలాలు, మ్యాన్ హోళ్లు, వరద నీటి కాలువలో ఆటంకాల్లేకుండా చూడాలన్నారు.
విద్యుత్, తాగునీరు, ట్రాఫిక్ సమస్య పరమైన సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని విప్ గాంధీ సూచించారు. రహదారులపై నీటి నిల్వ ప్రాంతాలలో తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా విభాగాల సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజలు సైతం అకాల వర్షం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని విప్ గాంధీ సూచించారు.