సీసీ రోడ్లు, అంతర్గత మురికి కాల్వల పనులు పూర్తి
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు
మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 12: రోడ్డుపై పారే మురుగు నీరు, చిన్నపాటి వర్షానికి చిత్తడిగా మారే రోడ్లు..ఇలా ఎన్నో అసౌకర్యాలతో బతుకులీడ్చిన పరిస్థితి నుంచి మోక్షం లభించింది. మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా దమ్మాయిగూడమున్సిపాలిటీలో రోడ్డు, డ్రైనేజీ సమస్యలకు పరిష్కారానికి పాలకులు భారీగా నిధులు వెచ్చించారు. దీంతో ఏండ్ల నాటి దుస్థితిలో మార్పు వచ్చింది. ఒకప్పుడు దమ్మాయిగూడలోని ఎన్నో కాలనీల్లో డ్రైనేజీ పొంగిపొర్లేది.
14వ వార్డులోని శ్రీ సాయి కాలనీ, ఎల్ఎస్ఆర్ కాలనీ, విఎంఎస్ హోమ్స్, అంజనాద్రి, అంజనాద్రి-2, తదితర కాలనీలు ఏర్పడి, సంవత్సరాలు గడుస్తున్నా మౌలిక సదుపాయలకు నోచుకోలేదు. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతూ వచ్చారు. మట్టి రోడ్లపై పారే మురుగు నీటితో అనేక ఇబ్బందులు పడ్డారు. మున్సిపాలిటీ నూతన పాలకవర్గం పదవి చేపట్టిన అనంతరం రూ. 50లక్షలతో అభివృద్ధి పనులు చేశారు. 14వ వార్డులో ఉన్న ప్రతి కాలనీలో మురికి కాలువలు నిర్మించి 100 శాతం పనులు పూర్తిచేశారు. సీసీ రోడ్ల నిర్మాణం కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది. చాలా రోజుల తర్వాత రోడ్లు, డ్రైనేజీ సమస్యలు తీరడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం..
డ్రైనేజీ, రోడ్డు సౌకర్యం లేక గతంలో అనేక ఇబ్బందులు పడ్డాం. రెండు సంవత్సరాల్లో వార్డులోని వివిధ కాలనీలో డ్రైనేజీ పనులు పూర్తి చేశారు. సీసీ రోడ్లు మాత్రం పలు కాలనీలో పూర్తి చేస్తున్నారు. – అనిల్, శ్రీ సాయి కాలనీ
డ్రైనేజీ సమస్యను పరిష్కరించాం..
14వ వార్డులో 100 శాతం సీసీ రోడ్లు పూర్తి చేశాం. డ్రైనేజీ సమస్యను కూడా పరిష్కరించాం. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేర కు వార్డులో అన్ని సమస్యలను పరిష్కరించాం. రూ.50లక్షలతో డ్రైనే జీ, సీసీ రోడ్లను నిర్మించాం. మున్ముందు మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతాం. – రమేశ్గౌడ్, కౌన్సిలర్, దమ్మాయిగూడ మున్సిపాలిటీ