ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 27 : రెండు చేతులు జోడిస్తే దండం.. రెండు చేతులు ముడిచి దోసిలి పడితే ‘దువా’.. రెండింటి మధ్య పెద్ద తేడా లేదని, వాటిని చూసే చూపుల్లోనే తేడా ఉన్నదని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. తెలంగాణను మతం కళ్ళతో చూసేవారి చూపులే బాగలేవని, మతాల మధ్య వైషమ్యాలు సృష్టించి మంటలు లేపడమే రాజకీయం అనుకుంటున్నారని దుయ్యబట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రీసర్చ్ సెంటర్లో ‘రిలీజియన్ అండ్ సొసైటీ ఇన్ తెలంగాణ.. ఫ్రమ్ శాతవాహనాస్ టు కాకతీయాస్’పై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. సెంటర్ డైరెక్టర్ డాక్టర్ కొండా నాగేశ్వర్ నిర్వహించిన ఈ సదస్సులో జూలూరు గౌరీశంకర్ పాల్గొని ప్రసంగించారు.
భిన్నత్వంలో ఏకత్వమే భారత జీవన విధానమని ఉద్ఘాటించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ చరిత్ర అభ్యసనంలో శాస్త్రీయమైన వైఖరిని ప్రామాణికంగా తీసుకుని దేశ, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని కోరారు. సదస్సు కన్వీనర్ డాక్టర్ కొండా నాగేశ్వర్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో దక్కన్ ల్యాండ్ ఎడిటర్ వేదకుమార్, ప్రముఖ పురావస్తుశాఖ పరిశోధకుడు ప్రొఫెసర్ శివనాగిరెడ్డి, ఓయూ యూజీసీ డీన్ ప్రొఫెసర్ జి.మల్లేశం, హిస్టరీ విభాగం హెడ్ ప్రొఫెసర్ అంజయ్య, సదస్సు కో కన్వీనర్ ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, ఓయూ సోషల్ సైన్సెస్ మాజీ డీన్ ప్రొఫెసర్ చెన్నబసవయ్య, ప్రొఫెసర్లు సుధారాణి, లావణ్య, సమున్నత, ఇందిర, రవికుమార్, శ్రీనివాసన్, సూర్యనారాయణ, వివిధ విభాగాలకు చెందిన పరిశోధక విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.