సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణకు ఉదయం నుంచే బస్తీలు, కాలనీల్లో జై భీమ్ నినాదాలు హోరెత్తాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులంతా ఆయా ప్రాంతాల్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మధ్యాహ్నం సమయంలో బస్సులు, ప్రత్యేక వాహనాలు, బైక్ ర్యాలీలతో భారీ విగ్రహం వద్దకు తరలివచ్చారు. మంత్రులు, మేయర్, డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్ల సారథ్యంలో పెద్ద ఎత్తున తరలి రాగా.. గ్రేటర్ నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలలు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారితో సాగర తీరం జనసందోహమైంది. అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్, బీఆర్ అంబేద్కర్ మనువడు ప్రకాశ్ అంబేద్కర్తో కలిసి ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ సందర్భంగా బౌద్ధ భిక్షవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహంపై హెలికాప్టర్ ద్వారా గులాబీ పూలవర్షం కురిపించారు. దేశ్ కీ నేత సీఎం కేసీఆర్ అంటూ నినాదాలు హోరెత్తించారు. సీఎం కేసీఆర్, అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడుతున్నంత సేపు ప్రాంగణమంతా చప్పట్లతో మార్మోమోగింది.