సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్కు 6 ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సులు రాబోతున్నాయి. ఈ బస్సులు పూర్తిగా నగరంలో ఉన్న పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాలను సందర్శించడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ పర్యాటక శాఖ సౌజన్యంతో డబుల్ డెక్కర్ బస్సులు నడుపనున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్ బస్సుల కోసం టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. కనీసం రెండు సంవత్సరాలు వారంటీ.. ఐదేండ్ల నిర్వహణ బాధ్యతలు ఉండే విధంగా డబుల్ డెక్కర్ బస్సుల పంపిణీ దారులు టెండర్లు దాఖలు చేయాలని కోరారు.
టెండర్ల దాఖలుకు ఈ నెల 14 వరకు గడువు విధించినట్లు నోటిఫికేషన్లో అధికారులు పేర్కొన్నారు. ప్రీ బిడ్ క్వెరీస్ దాఖలు చేయడానికి ఈ నెల 8 వరకు గడువు విధించారు. టెండర్ నోటిఫికేషన్లో పేర్కొన్నట్లుగా అన్ని స్పెసిఫికేషన్ ఉండే విధంగా పంపిణీ దారులు చర్యలు తీసుకోవాలన్నారు. అయితే టెండర్ల దరఖాస్తులు పూర్తిగా ఆన్లైన్ ద్వారా సమర్పించాలన్నారు. టెండర్ దాఖలు కోసం https:/tender.telangana.gov.in / www.hmda.gov.in వెబ్సైట్లను సంప్రదించాలన్నారు.