వెంగళరావునగర్, మార్చి 22: డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తానంటూ అమాయకులను బురిడీ కొట్టించి రూ.4.75 లక్షలు వసూలుచేసి పరారైన వ్యక్తిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. బీకేగూడ దాసారం బస్తీకి చెందిన ఎం.ధనలక్ష్మి (30)కి ఆమె సోదరుడి ద్వారా బాగుల తరుణ్ గౌడ్(43) అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ప్రభుత్వ ఉద్యోగినని, రూ.75 వేలు చెల్లిస్తే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు.
అతడి మాటలు నమ్మిన ధనలక్ష్మి గత సంవత్సరం మే 23న రూ.75 వేలు ఫోన్ పే ద్వారా చెల్లించింది. ఇంకా ఎవరికైనా ఇండ్లు కావాలంటే చెప్పాలని తరుణ్ గౌడ్ చెప్పడంతో తన సోదరి శ్రీలక్ష్మితో పాటు శ్రీలత, రాజేశ్వరిలకు కూడా చెప్పింది. వీరంతా ఇండ్ల కోసం రూ.4.75 లక్షలు చెల్లించారు. రోజులు గడుస్తున్నా ఇండ్లు ఇప్పించకపోవడంతో పాటు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు బుధవారం ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఎస్సై ప్రదీప్ భువనగిరిలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు.