బంజారాహిల్స్,ఆగస్టు 4 : రెండు పడకల గదుల ఇండ్ల దరఖాస్తుల పరిశీలన గురువారం జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలో ప్రారంభమయింది. ఆన్లైన్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం పెట్టుకున్న దరఖాస్తులలోని వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక అందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో సర్వే నిర్వహిస్తున్నారు. సర్కిల్ -18 పరిధిలోని బంజారాహిల్స్,జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, షేక్పేట డివిజన్ల పరిధిలో దరఖాస్తుల పరిశీలన కోసం 31 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఒక టీమ్ లీడర్లో పాటు అసిస్టెంట్ ఉంటారు. ఏరియా వారీగా ఇప్పటికే దరఖాస్తులను విభజించిన అధికారులు 500 దరఖాస్తులను ఒక చోటకు చేర్చి వాటికి డాకెట్ నెంబర్లు కేటాయించారు. వాటిని సేకరించిన అధికారులు దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు.
మొబైల్ యాప్లో వివరాలు నిక్షిప్తం
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి ఇంటికొచ్చి మొబైల్ యాప్లో వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఓటర్ ఐడీ కార్డు వివరాలు, అసెంబ్లీ నియోజకవర్గం వివరాలు, కులం,మతం, అడ్రెస్,ఫోన్ నెంబర్లతో పాటు అన్ని వివరాలను యాప్లో నమోదు చేసుకుంటున్నారు. ఈ సమాచారాన్ని యాప్లో నమోదు చేయడంతో పాటు రిజిస్టర్లలో రాసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలోని ఆస్తిపన్ను విభాగం, టౌన్ప్లానింగ్, శానిటేషన్, ఎంటమాలజీ, ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన సిబ్బంది ఈ సర్వేలో పాల్గొంటున్నారు. సర్వే నివేదికల ఆధారంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్మించిన ఇండ్లను లబ్ధిదారులకు లాటరీ ద్వారా కేటాయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.
సర్వే అధికారులకు సమాచారం ఇవ్వండి
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నవారిలో చాలామంది పూర్తివివరాలు ఆన్లైన్లో అందజేయలేదు. దీంతో వారికి సంబంధించిన వివరాలన్నింటినీ సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.
దీంతో జీహెచ్ఎంసీకి ఈ బాధ్యతను అప్పగించింది. ఇప్పటికే సర్వే నిర్వహించాల్సిన విధానంపై సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. సర్కిల్-18 పరిధిలో 31 బృందాలను ఏర్పాటు చేశాం. సర్వే కోసం ఇంటికొచ్చే సిబ్బందికి సహకరించి అన్ని వివరాలు అందించాలి.
– రజినీకాంత్రెడ్డి, డీఎంసీ, సర్కిల్ 18