ముషీరాబాద్,సెప్టెంబర్ 6: డెంగీ, సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, వైద్య సిబ్బంది, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి నియోజకవర్గంలోని ప్రతి ఇంటింటికీ గురువారం నుంచి జ్వరసర్వే చేపట్టనున్నారు. ముఖ్యంగా బస్తీలు, మురికివాడలు, నాలా పరివాహక ప్రాంతాల్లో ఏఎన్ఎంలు, ఆర్పీలు, ఇతర సిబ్బంది ఇం టింటికీ వెళ్లి సర్వే చేపడతారు. ఇంట్లో ఎవరైనా జర్వంతో బాధపడుతున్నారా, లక్షణాలు ఎంటీ అని ఆరా తీయడంతో పాటు అవసరమైన వారి రక్త నామూనాలు సేకరించి పరీక్షిస్తారు.ముఖ్యంగా డెంగీ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి అక్కడికక్కడే (డెంగ్యూ ర్యాపిడ్ టెస్టు) రక్త పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ చేయనున్నారు. సరైన ఫలితం రానివారి రక్త నమూనాలకు బస్తీ దవాఖానలు, పీహెచ్సీలకు పంపి పరీక్షిస్తారు. అవసరమైన వారికి మందులు ఇవ్వ డం, ఇతర దవాఖానలకు పంపిస్తారు.డెంగీ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు చేస్తారు. పనిలో పనిగా కోవిడ్ రెండో డోస్ వేసుకొని ఆరు నెలలు పూర్తి అయిన వారికి బూస్టర్ డోస్ ఇండ్ల వద్దనే వేయనున్నారు. ఈనెల 8వ తేదీ నుంచి నియోజకవర్గంలో భోలక్పూర్, దోమలగూడ, ముషీరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఇంటింటికీ జ్వర సర్వే చేపట్టనున్నారు.
పారిశధ్యంపై ప్రత్యేక దృష్టి
సీజనల్ వ్యాధుల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు మొదలు పెట్టారు. పారిశుధ్య విభాగం అధికారులు, సిబ్బంది బస్తీల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించనున్నారు. డెంగీ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో అధికారులు మురికివాడలు, నాలా పరివాహక బస్తీపై ప్రత్యేక దృష్టిసారించి నీటి నిల్వ, చెత్త పేరుకుపోవడం, పారిశుధ్య సమస్యలను గుర్తించి వెంటనే పారిశుధ్య సిబ్బంది సహాయంతో వాటిని తొలగిపు పనులు చేపట్టనున్నారు. ప్రజలకు సైతం తమ ఇండ్ల వద్ద నీటి నిల్వ ఉండకుండా చూసుకోవడం ఎలాగో అవగాహన కల్పిస్తున్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
చిక్కడపల్లి,సెప్టెంబర్6: ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని సూచించారు. డివిజన్లోని పలు కాలనీ బస్తీల్లో ఆమె మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దోమల నివారణకు ప్రజలు కూడా సహకారించాలని కోరారు. బస్తీ,కాలనీల్లో చెత్తాచెదారం, నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అనారు. కార్యక్రమంలో బీజేపీ యువ నాయకుడు ఎ.వినయ్కుమార్ ,జీహెచ్ఎంసీ అధికారులకు సిబ్బంది పాల్గొన్నారు.
వైద్య సిబ్బందికి ప్రజలు సహకరించాలి
ఇంటింటికీ జ్వర సర్వే ద్వారా డెంగీ, మలేరియా వంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి అక్కడికక్కడే పరీక్షించడం జరుగుతుంది. అవసరమైన వారిని బస్తీ దవాఖానలు, పీహెచ్సీలకు పంపించి రక్త పరీక్షలు చేయడంతో పాటు మందులు పంపిణీ చేస్తాం. ఈసర్వే వారంపాటు కొనసాగనున్నది. కోవిడ్ రెండో డోస్ వేసుకొని ఆరు నెలలు పూర్తి అయిన వారికి ఇండ్ల వద్ద లేదా, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో బూస్టర్ డోస్ వేస్తాం. సర్వే కోసం ఇండ్ల వద్దకు వచ్చే వైద్య సిబ్బందికి ప్రజలు సహకరించాలి.
– డాక్టర్ మౌనిక , ముషీరాబాద్ పీహెచ్సీ వైద్యురాలు