కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 3: ‘అధికార దాహంతో..వారంటీ లేని గ్యారెంటీలు ఇచ్చి.. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. తెలంగాణ ప్రాంత సంపదను ఢిల్లీకి తాకట్టుపెట్టి ఇక్కడి ప్రజల కష్టాన్ని దోచుకొని అన్యాయం చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు’ అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోరుతూ బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రంగారెడ్డి నగర్ డివిజన్ ముఖ్యకార్యకర్తల ప్రచార సభలో ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడారు.
అధికారమే పరమావధిగా గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అమలు కానీ హామీలను ఇచ్చి..ఇప్పుడు మాటల గారడిలతో కాలయాపన చేస్తున్నదన్నారు. ఢిల్లీలో తెలంగాణ కోసం ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ ఒక్కటే అని..డూడూ బసవన్నలైన కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే తెలంగాణ నిలువుదోపిడీ తప్పదన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలపించుకునేలా కార్యకర్తలంతా సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రంగారెడ్డినగర్ డివిజన్ కార్పొరేటర్ విజయశేఖర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.