మారేడ్పల్లి, ఆగస్టు 26 : మోండా మార్కెట్ను ఇక్కడి నుంచి తరలిస్తారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, ఈ మార్కెట్ను అన్ని రకాలుగా అభివృద్ది పరిచేందుకు త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తలపాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మంత్రి , మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్తో కలిసి మోండా మార్కెట్లోని కురగాయల మార్కెట్, మటన్ మార్కెట్, చేపల మార్కెట్, పాట్ మార్కెట్, తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.
నిజాం నవాబు కాలంలో నిర్మించిన ఈ మార్కెట్లో అనేక మంది చిరు వ్యాపారాలు నిర్వహించుకుంటూ..జీవనం కొనసాగిస్తున్నారని, మార్కెట్కు ఉన్న ప్రాధ్యాన్యత, చరిత్ర గురించి మంత్రి ప్రత్యేక ప్రధాన కార్య దర్శికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..వ్యాపారులు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, వసతులు కల్పించి ఈ మార్కెట్ను పూర్తి స్తాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇందుకోసం సమగ్ర నివేదికను రూపొందించేందుకు ఒక కన్సల్టెన్సీని నియమించడం జరిగిందని, 15 రోజులలో నివేదిక అందజేయాలని కన్సల్టెనీ సంస్థను ఆదేశించినట్లు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత వ్యాపారులతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించుకోనున్నట్లు తెలిపారు. వాహనాదారుల ఇబ్బందులు, ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పాలికాబజార్ చౌరస్తా నుంచి మోండా మార్కెట్లోని కూరగాయల బజార్ వరకు రోడ్డు విస్తరణ చేయాలని, పాత గాంధీ ఆసుపత్రి గోదాంను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ సిసిపి దేవేందర్ను ఆదేశించారు.
అదేవిధంగా పాత ఓల్డ్ జైల్ ఖానా వెనుక భాగంలో ఉన్న స్థలంలో మల్టిలెవల్ పార్కింగ్ను నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, కార్పొరేటర్ దీపిక, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, టౌన్ప్లానింగ్ ఏసిపి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.